iPhone Defect: ఐఫోన్ యూజర్ కు వినియోగదారుల ఫోరంలో భారీ ఊరట లభించింది. కొనుగోలు చేసిన ఐఫోన్ 12లో లోపాలు ఉన్నప్పటికీ దాన్ని సరిచేయకుండా నిర్లక్ష్యం వహించినందుకు గాను యాపిల్ ఇండియాతో పాటు దాని సర్వీస్ సెంటర్కు కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. లోపభూయిష్టంగా ఉన్న ఆ ఫోన్ను తక్షణమే మార్చడం లేదా ఫోన్ ధర రూ. 40,449 మొత్తాన్ని వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. అలాగే బాధితుడి ఖర్చుల కింద రూ.10,000 చెల్లించాలని తీర్పు వెలువరించింది.
చండీగఢ్ కు చెందిన ఫిర్యాదుదారుడు.. 2021 అక్టోబర్ లో యాపిల్ అధికారిక డీలర్ నుంచి రూ. 40,449 చెల్లించి ఐఫోన్ 12 (iPhone 12) స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేశారు. ఈ క్రమంలో మెుబైల్ పై ఏడాది వారంటీని సైతం యాపిల్ ఇచ్చింది. అయితే కొన్న కొద్ది రోజులకే ఆ ఫోన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో యాపిల్ సర్వీస్ సెంటర్ ను ఆశ్రయించారు. అక్కడి సిబ్బంది ఫోన్ చెక్ చేసి.. సాంకేతిక సమస్య ఉన్నట్లు నిర్ధారించారు. అయితే రీపేర్ లేదా రీప్లేస్ మెంట్ చేయాలన్న బాధితుడి డిమాండ్ ను సర్వీస్ సెంటర్ నిర్వాహకులు పట్టించుకోలేదు.
ఫోన్ కోసం పలుమార్లు సర్వీస్ సెంటర్ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని ఫిర్యాదు దారుడు వాపోయాడు. నెలలు గడుస్తున్నా ఫోన్ చేతికి రాకపోవడంతో.. బాధితుడు చండీగఢ్ వినియోగదారుల ఫోరం కోర్టును ఆశ్రయించారు. ఫోన్ ను అమ్మిన శ్రేయాష్ రిటైల్ షాపు, యాపిల్ ఇండియా, ఇన్ఫోసొలుష్యన్స్ సర్వీస్ సెంటర్ పై ఫిర్యాదు చేశాడు. ఐఫోన్ 12 మెుబైల్ ను మార్చాలని లేదంటే తాను చెల్లించిన డబ్బును వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని కోరారు. అలాగే కోర్టు, వాణిజ్య ఖర్చులు వాపస్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
ఈ కేసు విచారణ సందర్భంగా యాపిల్ ఇండియా ప్రతినిధులు తమ వాదనలను వినిపించారు. కంపెనీ నిబంధనల ప్రకారం సర్వీస్ అందించామని, వినియోగదారుడి వైపు నుంచే పొరపాటు జరిగి ఉండవచ్చని వాదించే ప్రయత్నం చేశారు. అయితే ఫోన్లో ఉన్నది మాన్యుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అని, వారంటీ పీరియడ్లోనే సమస్య వచ్చినా కంపెనీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని కస్టమర్ తరపు న్యాయవాది తగిన ఆధారాలను కోర్టు ముందు ఉంచారు.
Also Read: సామాన్యుల ప్లాన్.. రూ.249కే 35 రోజుల వ్యాలిడిటీ.. రోజూ 2GB డేటా, ఫ్రీ కాల్స్!
ఇరుపక్షాల వాదనలు విన్న చండీగడ్ వినియోగదారుల ఫోరమ్ కోర్టు.. యాపిల్ ఇండియా, సదరు సర్వీస్ సెంటర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందించడం కంపెనీల ప్రాథమిక బాధ్యత అని స్పష్టం చేసింది. ఫిర్యాదు దారుడికి చెందిన ఐఫోన్ 12 స్థానంలో మరో కొత్త ఫోన్ ఇవ్వాలని, సాధ్యం కాకపోతే ఫోన్ ఫిర్యాదు దారుడు చెల్లించిన రూ.40,449 మొత్తాన్ని రీఫండ్ చేయాలని ఆదేశించింది. అదే సమయంలో కోర్టు, వాణిజ్య ఖర్చుల కింద మరో రూ.10,000 పరిహారంగా చెల్లించాలని దిశా నిర్దేశం చేసింది.
Also Read: ఫ్రిడ్జ్లో ఈ పండ్లు పెడుతున్నారా? పెద్ద తప్పు చేస్తున్నట్లే.. షాకింగ్ నిజాలు!