Technology: ప్రపంచ డిజిటల్ శక్తిగా అవతరించింది భారత్. కేవలం పుష్కరకాలంలో ఈ ఘనత సాధించింది. ఒకప్పుడు టెక్నాలజీ వినియోగదారుగా ఉండేది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు, క్వాంటం టెక్నాలజీస్, డేటా సెంటర్లు వంటి అత్యాధునిక రంగాల్లో దూసుకుపోతోంది. ప్రపంచ స్థాయి పరిష్కారాలను సృష్టించే స్థాయికి చేరుకుంది. ప్రభుత్వ విధానాలు, డిజిటల్ మౌలిక సదుపాయాల విస్తరణ, ఆవిష్కరణలకు అనుకూల వాతావరణం దీనికి కారణమైంది. ఈ విషయాన్ని ఫ్యాక్ట్-షీట్ నివేదిక పేర్కొంది.
గ్లోబల్ పవర్హౌజ్గా భారత్.. మెరుగైన ర్యాకింగ్
భారత్ ఈ స్థాయికి చేరడానికి తీసుకున్న నిర్ణయాలు కీలకపాత్ర పోషించాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. దేశంలో 2014 నాటికి 25.15 కోట్లు ఇంటర్నెట్ కనెక్షన్లు ఉండేవి. 2026 నాటికి ఆ సంఖ్య కాస్త 102 కోట్లకు చేరింది. అదే సమయంలో బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లు 6.1 కోట్ల నుంచి సుమారు 100 కోట్లకు చేరాయి. దేశవ్యాప్తంగా ఆప్టికల్ ఫైబర్ కవరేజ్ 42 లక్షల కిలోమీటర్లకు పైగానే విస్తరించింది. అన్ని జిల్లాలకు 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయని ప్రస్తావించింది.
ఒక్కమాటలో చెప్పాలంటే టెక్నాలజీ రంగంలో భారత్ తన సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుంది. జాతీయ సూపర్ కంప్యూటింగ్ మిషన్ కింద.. విద్యా సంస్థల్లో 47 పెటాఫ్లాప్ల సామర్థ్యంతో 38 సూపర్ కంప్యూటర్లను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. అదే విధంగా రూ. 10,300 కోట్ల వ్యయంతో ప్రారంభించిన ఇండియా ఏఐ మిషన్ 38000 జీపీయూలతో ఒక ఉమ్మడి కంప్యూటింగ్ సదుపాయాన్ని నిర్మిస్తోంది. ఏఐ కోష్ ప్లాట్ఫామ్ 20 రంగాలకు చెందిన 12,000కు పైగా డేటాసెట్లను, 300కు పైగా ఏఐ మోడల్లను కలిగి ఉన్నాయి.
అంతా పుష్కరకాలంలో.. ఆవిష్కరణలకు కేంద్రంగా భారత్
సెమీకండక్టర్ల తయారీ విషయానికి వద్దాం. సెమికాన్ ఇండియా కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తోంది. రూ.76 వేల కోట్లతో ప్రారంభించింది. ఇప్పటివరకు దాదాపు రూ.1.64 లక్షల కోట్ల విలువైన 12 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది ప్రభుత్వం. సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ, చిప్ ప్యాకేజింగ్ వంటి ప్లాంట్లు ఇందులో ఉన్నాయి. క్వాంటం టెక్నాలజీలో భారత్ గణనీయమైన పురోగతి సాధించింది. రూ.6,003 కోట్లతో నాలుగు నేషనల్ క్వాంటం మిషన్ కేంద్రాలను ప్రారంభించింది. దీనివల్ల అనేక స్టార్టప్లకు మద్దతు లభించినట్లయ్యింది. ఇటీవల 1,000 కిలోమీటర్ల దూరంలో క్వాంటం కమ్యూనికేషన్ నెట్వర్క్ విజయవంతమైంది.
డేటా సెంటర్ల సామర్థ్యం వేగంగా పెరుగుతోంది. 2020 ఏడాది 375 మెగావాట్లుగా ఉన్న సామర్థ్యం ఉన్న డేటా సెంటర్లు.. 2025 నాటికి నాలుగు రెట్లు పెరిగాయి. ప్రస్తుతం 1,500 మెగావాట్లకు చేరిందని ఓ అంచనా. ముంబై, హైదరాబాద్, బెంగళూరు, నోయిడా, జామ్నగర్ వంటి ప్రాంతాలు ప్రధాన హబ్లుగా ఉన్నాయి.ఆధార్, యూపీఐ, డిజిలాకర్, కోవిన్ వంటి ప్లాట్ఫామ్లతో భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది.
ALSO READ: సీలింగ్ vs పెడెస్టల్ ఫ్యాన్.. కూలింగ్ ‘కింగ్’ ఎవరు? అసలు నిజం ఇదీ!
ఇప్పటికే 23 దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోగా సింగపూర్, యూఏఈ, ఫ్రాన్స్, నేపాల్, శ్రీలంక వంటి దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పైన వచ్చిన ఫలితాల కారనంగా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో భారత్ ర్యాంకు మెరుగుపడింది. 2015లో 81వ స్థానంలో ఉన్న భారత్, 2025 నాటికి 38వ స్థానానికి చేరింది. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పరిశోధనలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులపై పెడుతున్న పెట్టుబడులతో భవిష్యత్ టెక్నాలజీలకు, ఆవిష్కరణలకు భారత్ గ్లోబల్ హబ్గా మారుతోందని తన నివేదికలో పేర్కొంది.