Whats app: భారతదేశంలో మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ (WhatsApp) వేదికగా జరుగుతున్న సైబర్ దందా ఇప్పుడు దేశ భద్రతకే సవాలుగా మారింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది దీనిపై ఆధారపడుతుండటాన్ని ఆసరాగా చేసుకుని, కేటుగాళ్లు డిజిటల్ అరెస్టులు, నకిలీ అధికారుల పేరుతో సాగిస్తున్న మోసాల వెనుక ఉన్న అసలు రహస్యాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా వాట్సాప్ బ్యాన్ చేస్తున్న కోట్లాది అకౌంట్ల వెనుక ఉన్న వాస్తవాలను స్పష్టంగా వెల్లడించడంలో ఆ సంస్థ వెనుకడుగు వేయడం ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆ అకౌంట్ల గుట్టు బయటపెడితేనే తప్ప ఈ నేర సామ్రాజ్యాన్ని తొలగించడం సాధ్యం కాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. వీటన్నింటి మధ్య నలిగిపోతున్న సామాన్య వినియోగదారులు చివరికి సైబర్ మోసాలకు బలవుతున్నారు.
భారీగా బ్యాన్ అవుతున్న భారత ఖాతాలు
వాట్సాప్ తన విధానాలను ఉల్లంఘించిన ఖాతాలపై ప్రతి నెలా చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు నెలకు సగటున 9.8 మిలియన్ భారత ఖాతాలు బ్యాన్ అయ్యాయి. జనవరిలో 9.9 మిలియన్, ఫిబ్రవరిలో 9.7 మిలియన్, మార్చిలో 11.1 మిలియన్, ఏప్రిల్లో 9.7 మిలియన్, మేలో 11.2 మిలియన్, జూన్లో 9.8 మిలియన్, జూలైలో 8.9 మిలియన్, ఆగస్టులో 8.2 మిలియన్, సెప్టెంబర్లో 10.0 మిలియన్, అక్టోబర్లో 9.1 మిలియన్ ఖాతాలు బ్యాన్ అయ్యాయి. ఈ సంఖ్యలు వాట్సాప్ నెలవారీ నివేదికల్లో వెల్లడైనా, ఏ మొబైల్ నంబర్లు బ్యాన్ అయ్యాయన్న వివరాలు మాత్రం బయటకు రావడం లేదు. ఇదే అంశం ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది.
Also Read: Flipkart offers: ఫ్లిప్కార్ట్ సేల్.. రూ.9వేలలోపే టాప్ రియల్మీ ఫోన్లు.. తక్కువ ధరకే కొనే ఛాన్స్
ప్రభుత్వానికి ఎందుకు ఆందోళన?
ప్రభుత్వ అధికారుల ఆందోళన ప్రధానంగా ఒకే అంశం చుట్టూనే తిరుగుతోంది. బ్యాన్ అయిన ఖాతాలకు సంబంధించిన మొబైల్ నంబర్ల వివరాలు వాట్సాప్ పంచుకోవడం లేదు. ఖాతాలు +91 కోడ్తో భారత ఖాతాలుగా గుర్తించినప్పటికీ, ఆ నంబర్లు నిజమైనవా లేక నకిలీవా అన్నది తెలుసుకునే అవకాశం ప్రభుత్వం గుర్తించలేక పోతోంది. దీంతో స్పామ్, స్కామ్, సైబర్ మోసాలను మూలాల వరకూ వెళ్లి గుర్తించడం కష్టమవుతోంది. ఒకసారి బ్యాన్ అయిన నంబర్లు తిరిగి ఇతర ఓటిటి యాప్లలో యాక్టివ్ అవుతూ మళ్లీ మోసాలకు ఉపయోగపడుతున్నాయన్నది అధికారుల ఆందోళనను మరింత పెంచుతోంది.
స్పష్టతపై మాజీ అధికారి వ్యాఖ్యలు
ఈ వ్యవహారంపై కేంద్ర ఐటీ శాఖ మాజీ సీనియర్ డైరెక్టర్ (Rakesh Maheshwari) కీలక వ్యాఖ్యలు చేశారు. వాట్సాప్ వంటి సంస్థలు సమర్పించే నెలవారీ నివేదికల (Monthly Reports) ప్రధాన ఉద్దేశమే జవాబు చెప్పడం, స్పష్టతను పెంచడమని ఆయన గుర్తుచేశారు. ఈ నివేదికల్లోని అంశాలు అనుమానాస్పదంగా ఉన్నా లేదా లోతైన విచారణ అవసరమని భావించినా.. సదరు సంస్థల నుంచి అదనపు సమాచారాన్ని సేకరించే పూర్తి అధికారం ప్రభుత్వానికి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కనీసం బ్యాన్ అయిన నంబర్ల జాబితా అయినా అందిస్తే, సిమ్ జారీ తేదీ, కేవైసీ నిజానిజాలు నిర్ధారించి ఈ సైబర్ మోసాలకు గట్టి అడ్డుకట్ట వేయొచ్చని అధికారుల అభిప్రాయం. మరోవైపు వాట్సాప్ మాత్రం ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్, చట్టపరమైన అడ్డంకులను కారణంగా చూపుతూ పూర్తి సమాచారం ఇవ్వలేమని స్పష్టం చేస్తోంది. దీనితో ఒకవైపు వినియోగదారులు, మరోవైపు దేశ భద్రత మధ్య సరైన సమన్వయం ఎలా ఉండాలన్న ప్రశ్న దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది.