Railway Night Rules: రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. ప్రయాణ సమయంలో తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా, ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రశాంతతను కాపాడేందుకు కొత్త నిబంధనలను కఠినతరం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు అమలయ్యే ఈ ‘నైట్ ప్రోటోకాల్’ గురించి ప్రతి ప్రయాణికుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
సాధారణంగా రైలు ప్రయాణాల్లో కొందరు బిగ్గరగా ఫోన్ మాట్లాడటం లేదా స్పీకర్లలో పాటలు వినడం వల్ల తోటి వారికి నిద్ర భంగం కలుగుతుంటుంది. దీనిపై వచ్చే ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న రైల్వే శాఖ, రాత్రి 10 గంటల తర్వాత ఫోన్లో బిగ్గరగా మాట్లాడటాన్ని పూర్తిగా నిషేధించింది. ఒకవేళ మాట్లాడాల్సి వస్తే ప్రయాణికులు చాలా తక్కువ స్వరంతో సంభాషించాలి. అలాగే, మొబైల్స్లో గానీ, ల్యాప్టాప్స్లో గానీ సినిమా చూస్తున్నప్పుడు లేదా పాటలు వింటున్నప్పుడు ఖచ్చితంగా ఇయర్ ఫోన్స్ వాడాలని స్పష్టం చేసింది. గ్రూపులుగా ప్రయాణించే వారు రాత్రి వేళల్లో గుంపులుగా చేరి చర్చలు జరపడం, నవ్వుతూ శబ్దం చేయడం కూడా నిబంధనలకు విరుద్ధమే.
రాత్రి 10 గంటలు దాటిన తర్వాత కోచ్లోని మెయిన్ లైట్లను ఆపివేయాలి. కేవలం నైట్ ల్యాంప్స్ మాత్రమే ఉపయోగించాలి. ఇక మిడిల్ బెర్త్ ప్రయాణికులకు సంబంధించి పాత వివాదాలకు స్వస్తి పలుకుతూ రైల్వే క్లారిటీ ఇచ్చింది. రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు మిడిల్ బెర్త్ను వినియోగించుకోవచ్చు. ఈ సమయంలో లోయర్ బెర్త్ ప్రయాణికులు అభ్యంతరం చెప్పడానికి వీలులేదు. అదేవిధంగా ఉదయం 6 గంటలు దాటిన తర్వాత మిడిల్ బెర్త్ను తప్పనిసరిగా దించివేయాలి, తద్వారా లోయర్ బెర్త్ ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చునే అవకాశం ఉంటుంది.
ప్రయాణికుల నిద్రకు భంగం కలగకుండా టికెట్ చెకింగ్ సిబ్బందికి (TTE) కూడా రైల్వే కొన్ని సూచనలు చేసింది. రాత్రి 10 గంటల తర్వాత ప్రయాణికులను నిద్రలేపి టికెట్లు అడగకూడదు. అయితే, రాత్రి 10 గంటల తర్వాత రైలు ఎక్కే కొత్త ప్రయాణికులకు మాత్రం ఈ మినహాయింపు ఉండదు. వారి టికెట్లను సిబ్బంది ఎప్పుడైనా తనిఖీ చేయవచ్చు.
ఈ నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే వారిపై రైల్వే చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. తోటి ప్రయాణికుల నుండి ఫిర్యాదు అందితే, రైల్వే భద్రతా దళం (RPF) లేదా TTE జోక్యం చేసుకుని జరిమానా విధించే అవకాశం ఉంది. నిరంతరం నిబంధనలు ఉల్లంఘించే వారిని రైలు నుండి దించివేసే అధికారం కూడా అధికారులకు ఉంటుంది. రైల్వే ప్రయాణమనేది ఒక సామాజిక బాధ్యత. మన సౌకర్యం కోసం ఇతరులకు ఇబ్బంది కలిగించడం సరైనది కాదు. కాబట్టి ప్రయాణికులు ఈ కొత్త నిబంధనలను పాటించి, రైల్వే శాఖకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో లేదా ఇబ్బందులు ఎదురైనప్పుడు ప్రయాణికులు 139 నంబర్కు డయల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.