Mercedes Benz : జర్మనీకి చెందిన విలాస కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లగ్జరీ వాహన ప్రియుల కోసం సరికొత్త డిజైన్, భద్రత ఫీచర్లు ఉన్న విలాసవంతమైన కార్లను మార్కెట్లలోకి విడుదల చేస్తుంటుంది. అలానే భారత్లోని చిన్న నగరాల్లో కూడా తన ఉనికిని విస్తరించుకోవడానికి గత కొద్ది నెలలుగా గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. ఎందుకంటే భవిష్యత్లో చిన్న నగరాల్లోనూ లగ్జరీ మోడళ్లకు డిమాండ్ పెరుగుతుందని సందరు సంస్థ భావిస్తోంది. అందుకే పెరుగుతున్న కస్టమర్ల అవసరాలను తీర్చడానికి, సేవా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే దిశగా ముందుకెళ్తోంది.
అయితే ఈ క్రమంలోనే మెర్సిడెస్ బెంజ్ వాహన ప్రియులకు షాకిచ్చింది! ప్రస్తుతం తమ కార్ల ధరల పెంపునకు సిద్ధమైంది. తమ సంస్థకు చెందిన అన్నీ మోడల్ కార్ల ధరల్ని 3 శాతం వరకు పెంచనున్నట్లు తాజాగా అధికారికంగా అనౌన్స్ చేసింది. 2025 జనవరి 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానున్నట్లు స్పష్టత ఇచ్చింది. అయితే డిసెంబర్ 31 లోపు తమ లగ్జరీ కార్లను బుకింగ్ చేసుకునే వారికి ఈ పెంపు వర్తించదని క్లారిటీ ఇచ్చింది. అంటే ఈ లెక్కన బెంజ్ కార్ల ధరలు కనిష్ఠంగా రూ. 2 లక్షల నుంచి గరిష్ఠంగా రూ. 9 లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. నిజానికి బెంజ్ కార్ ప్రియులకు ఇది షాకింగ్ వార్తనే చెప్పాలి.
తమ సంస్థకు చెందిన కార్ల ధరల పెంపుదల ఎందుకు చేస్తున్నట్లో కూడా వివరించింది మెర్సిడెస్. ద్రవ్యోల్బణం, ఇంధన ధరల్లో హెచ్చుతగ్గుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. “ద్రవ్యోల్బణం, ఇంధన ధరల్లో హెచ్చు తగ్గుల కారణంగా ఈ ధరల పెంపు నిర్ణయం తీసుకున్నాం. ఈ హెచ్చు తగ్గుల కారణంగా వ్యాపార కార్యకలాపాలపై భారీ ఒత్తిడి పెరుగుతోంది. గత మూడు త్రైమాసికాల నుంచి పరిశీలిస్తే కంపెనీ నిర్వహణ వ్యయం కూడా బాగా పెరుగుతోంది. అందుకే ఈ ధరల పెంపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది” అని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈఓ సంతోష్ అయ్యర్ పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు వీటి సేల్స్ పెరుగుతున్నాయని.. వాటికి అనుగుణంగానే ధరలు కూడా పెంచాల్సి వస్తుందని తెలిపారు.
Mercedes Benz Indian Sales : కాగా, మెర్సిడెస్ బెంజ్ ప్రస్తుతం రూ. 45 లక్షలు విలువైన ఏ క్లాస్ కార్ల నుంచి రూ. 3.6 కోట్ల జీ63 ఎస్యూవీ వరకు అనేక రకాల మోడళ్లను దేశీయంగా విక్రయిస్తోంది. అలానే ఈ లగ్జరీ కార్ల విక్రయాలు భారత్లో గణనీయంగా పెరిగినట్లు గత నెల అక్టోబర్లో రిపోర్ట్ వచ్చింది. 2024 సంవత్సరంలో మొదటి 9 నెలల(జనవరి-సెప్టెంబర్) కాల వ్యవధిలో 13% వృద్ధితో 14,379 కార్లను విక్రయించినట్లు తెలిసింది.
Mercedes Benz Recently Launched Car : ఇకపోతే రీసెంట్గానే మెర్సిడెస్ బెంజ్ ‘ఏఎంజీ సీ 63 ఎస్ ఈ పెర్ఫార్మెన్స్’ కారును మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఎఫ్1 హైబ్రిడ్ టెక్నాలజీతో దీనిని రూపొందించింది. ఈ కారు ధర రూ. 1.95 కోట్లు. 2024లో మెర్సిడెస్ కంపెనీ నుంచి వచ్చిన 24వ మోడల్ ఇది. ఈ విలాసవంతమైన కారు గంటకు 0-100 కి.మీ వేగాన్ని కేవలం 3.4 సెకన్లలోనే అందుకుంటుంది.