Samsung Security: దేశంలోని శాంసంగ్ మొబైల్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా శాంసంగ్ గెలక్సీ మెుబైల్ వినియోగిస్తున్న కోట్లాది మంది వినియోగదారులకు హ్యాకింగ్ ముప్పు పొంచి ఉందని ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ అయిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) వెల్లడించింది. కాబట్టి గెలాక్సీ యూజర్లు అప్రమత్తంగా ఉండాలని.. అందుబాటులో ఉన్న సెక్యూరిటీ అప్డేట్స్ ను వెంటనే డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది.
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన ‘ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్’ (CERT-In).. శామ్సంగ్ ఫోన్లలో కొన్ని తీవ్రమైన భద్రతా లోపాలను గుర్తించింది. ఈ లోపాలను ‘హై సివియారిటీ’ (అత్యంత ప్రమాదకరం) కేటగిరీగా వర్గీకరించింది. శాంసంగ్ నాక్స్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్లోని ఒక భద్రతా లోపం వల్ల హ్యాకర్లు సులభంగా వినియోగదారుల ఫోన్లలోకి చొరబడే అవకాశం ఉందని హెచ్చరించింది.
శాంసంగ్ కంపెనీకి చెందిన గెలాక్సీ ఎస్ సిరీస్ (Galaxy S23, S24), ఫోల్డబుల్ ఫోన్లు, గెలాక్సీ A, M సిరీస్లోని పాత, కొత్త మోడళ్లు ఈ ముప్పును ఎదుర్కొంటున్నట్లు సైబర్ భద్రతా సంస్థ సూచించింది. మరి ముఖ్యంగా ఆండ్రాయిడ్ 13, 14, 15, సరికొత్త ఆండ్రాయిడ్ 16 వెర్షన్లపై నడుస్తున్న ఫోన్లలో ఈ భద్రతా లోపాలు ఉన్నట్లు స్పష్టం చేసింది.
CERT-In వెబ్సైట్లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. నాక్స్ సెక్యూరిటీ సాఫ్ట్ వేర్ లోపాలను ఉపయోగించుకొని.. సైబర్ నేరగాళ్లు కొన్ని పనులు చేసే అవకాశముంది. అనుమతి లేకుండానే ఫోన్ సెక్యూరిటీని బైపాస్ చేయడం, సిమ్ కార్డ్ పిన్ నంబర్లను దొంగిలించడం, వ్యక్తిగత ఫైళ్లు, ఫోటోలు, బ్యాంకింగ్ సమాచారాన్ని యాక్సెస్ చేయడం, ఫోన్ బ్యాండ్విడ్త్ను ఉపయోగించి రహస్యంగా మాల్వేర్ కోడ్లను రన్ చేయడం వంటివి చేయవచ్చని సదరు నివేదిక హెచ్చరించింది.
Also Read: తుంగభద్ర డామ్ గేట్లు.. ముగ్గురు సీఎంలు రేవంత్-చంద్రబాబు-డీకే కలయిక, అతిథి గృహంలో మాటామంతీ
హ్యాకర్ల ముప్పు నుంచి తప్పించుకునేందుకు అనుసరించాల్సిన మార్గాలను సైతం కేంద్రం సైబర్ సంస్థ వెల్లడించింది. కంపెనీ అందించే అధికారిక సెక్యూరిటీ అప్డేట్లను ఇన్స్టాల్ చేసుకోవాలని హితవు పలికింది. ఇందుకోసం గెలాక్సీ ఫోన్ లోని సెట్టింగ్స్ లోకి వెళ్లి సాఫ్ట్వేర్ అప్డేట్ ఆప్షన్ను క్లిక్ చేయండి. ఒకవేళ అప్ డేట్ రెడీ ఉంటే.. డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ బటన్ను నొక్కండి. అప్డేట్ పూర్తయ్యాక ఫోన్ రీస్టార్ట్ అవుతుంది. ఇలా చేస్తే.. సైబర్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని కేంద్ర సంస్థ స్పష్టం చేసింది.
Also Read: ఫ్రిడ్జ్లో స్పేస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అడ్జస్టబుల్ షెల్వ్స్ ఉన్న టాప్ 5 రిఫ్రిజిరేటర్లు!