అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కుదేలు.. అమెరికా విధిస్తున్న కఠిన సుంకాలు.. హెచ్1బీ వీసా ఫీజుల పెంపు వంటి సవాళ్లతో సతమతమవుతున్న భారతీయ ఐటీ రంగానికి దేశీయ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఊపిరిపోసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో.. టీసీఎస్ అంచనాలను మించి రాణించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక (క్యూ4) ఫలితాలను ఏప్రిల్ 9న విడుదల చేసిన సంస్థ లాభాల్లో అద్భుతమైన వృద్ధిని కనబరిచింది. గత ఏడాది కాలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న ఐటీ రంగంలో ఈ ఫలితాలు కొత్త ఆశలు చిగురింపజేశాయి.
ప్రస్తుత త్రైమాసిక ఫలితాల్లో టీసీఎస్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 12 శాతానికి పైగా పెరిగి రూ. 13,718 కోట్లుగా నమోదైంది. గత త్రైమాసికంతో పోలిస్తే ఇది ఏకంగా 29 శాతం పెరగడం గమనార్హం. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం కూడా 9 శాతం వృద్ధితో రూ. 70,698 కోట్లకు చేరింది. లాభాల్లో జోరు కొనసాగించిన కంపెనీ.. తన వాటాదారులకు ప్రతి ఈక్విటీ షేరుపై రూ. 31 ఫైనల్ డివిడెండ్ ప్రకటించి అండగా నిలిచింది. 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం రూ. 39,571 కోట్లను డివిడెండ్ రూపంలో పంపిణీ చేయడం విశేషం.
ఐటీ ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేతనాల పెంపుపై టీసీఎస్ కీలక ప్రకటన చేసింది. చాలా కంపెనీలు జీతాల పెంపును వాయిదా వేస్తున్నా.. టీసీఎస్ మాత్రం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచే వేతనాల పెంపును అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని సంస్థ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ సుదీప్ కున్నుమల్ అధికారికంగా ప్రకటించారు. అన్ని గ్రేడ్ల ఉద్యోగులకు ఈ పెంపు వర్తిస్తుందని ఆయన తెలిపారు. ప్రతిభ కనబరిచిన టాప్ పెర్ఫామర్లకు డబుల్ డిజిట్ (పది శాతం పైగా) పెంపు ఉంటుందని సంకేతాలు ఇచ్చారు. గతంలో 4.5 నుంచి 7 శాతం వరకు ఉన్న సగటు పెంపు ఈసారి మరింత మెరుగ్గా ఉండవచ్చని తెలుస్తోంది.
ఏఐ టెక్నాలజీ రాకతో ఐటీ రంగం భవిష్యత్తుపై నెలకొన్న అనుమానాలను టీసీఎస్ పటాపంచలు చేసింది. ఏఐ ఫస్ట్ కల్చర్ను నిర్మిస్తున్నామని.. తమ సిబ్బందికి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తున్నామని సంస్థ తెలిపింది. క్యాంపస్ రిక్రూట్మెంట్లు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. గత త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య తగ్గగా.. ఈసారి మాత్రం కంపెనీలో కొత్తగా 2,000 మందికి పైగా సిబ్బంది చేరారు. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,84,519కి చేరింది. ఇందులో మహిళా ఉద్యోగుల వాటా 35.2 శాతంగా ఉండటం విశేషం.
గత కొన్నేళ్లుగా ఐటీ రంగంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల వల్ల కంపెనీ షేర్ విలువ ఒడిదుడుకులకు లోనైంది. ఏడాది కాలంలో టీసీఎస్ స్టాక్ సుమారు 20 శాతం మేర పతనమైంది. అయితే తాజా ఫలితాలు.. వేతనాల పెంపు నిర్ణయంతో ఇన్వెస్టర్లలో భరోసా పెరిగింది. విశ్లేషకులు కూడా ఈ స్టాక్ పట్ల సానుకూలంగా ఉన్నారు. టీసీఎస్ బాటలోనే మిగిలిన ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్.. హెచ్సీఎల్ టెక్ వంటివి కూడా సానుకూల ఫలితాలు ప్రకటిస్తాయని ఐటీ నిపుణులు భావిస్తున్నారు. ఈ నిర్ణయాలు దేశీయ సాఫ్ట్వేర్ రంగంలో మళ్లీ పూర్వ వైభవం తెస్తాయని ఆశిస్తున్నారు.
ALSO READ: హ్యుందాయ్ నుంచి కళ్లు చెదిరే ఫ్యూచరిస్టిక్ కార్లు, డిజైన్ చూస్తే మతిపోవాల్సిందే!