New Hyundai EV Lineup for China: ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ రోజు రోజుకు మరింత విస్తరిస్తుంది. భారత్ తో పాటు చైనాలో మరింత వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో హ్యుందాయ్ కొత్తగా రూపొందించిన రెండు కాన్సెప్ట్ కార్లను పరిచయం చేసింది. వీటికి వీనస్, ఎర్త్ అనే పేర్లు పెట్టింది. ఈ రెండు వాహనాలు పూర్తిగా చైనా వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసింది. ప్రపంచంలోని ఇతర మార్కెట్లలో ఉన్న ఐయోనిక్ మోడళ్లతో పోలిస్తే, ఇవి భిన్నమైన స్టైల్, టెక్నాలజీతో రూపొందించబడ్డాయి.
ఈ కొత్త మోడళ్లకు, ఈసారి గ్రహాల పేర్లును పెట్టింది హ్యుందాయ్. దీనివల్ల ప్రతి వాహనం వినియోగదారుడిని కేంద్రంగా ఉంచుకుని రూపొందించబడిందనే భావనను కంపెనీ తెలియజేయాలని భావిస్తోంది. వీనస్ మోడల్ చక్కటి ఎలక్ట్రిక్ సెలూన్ కారు. ఇది సూపర్ డిజైన్ తో పాటు భిన్నమైన రూపంతో కనిపిస్తుంది. గోల్డ్ కలర్, స్లీక్ బాడీ, ప్రత్యేకమైన రూఫ్ నిర్మాణం దీనికి అదనపు ఆకర్షణను తీసుకొచ్చాయి. లోపలికి వెళ్తే, పూర్తిగా డిజిటల్ ఎక్స్ పీరియెన్స్ లభిస్తుంది. పెద్ద స్క్రీన్ మొత్తం డ్యాష్ బోర్డ్ ను అంతా విస్తరించి ఉంటుంది. బటన్లు, స్విచ్లు లేకుండా, టచ్ ఆధారిత వ్యవస్థతో అన్ని ఫంక్షన్లు నిర్వహించవచ్చు. డ్రైవర్కు కొత్త అనుభూతిని ఇస్తుంది.
ఇక ఎర్త్ మోడల్ విషయానికి వస్తే, బలమైన SUV రూపంలో ఉంటుంది. ఔట్ డోర్ ప్రయాణాలకు అనుకూలంగా దీన్ని రూపొందించారు. పెద్ద బాడీ, గట్టి కవరింగ్, స్కిడ్ ప్లేట్లు లాంటివి ఉన్నాయి. లోపల విస్తృత స్థలం, సౌకర్యవంతమైన సీట్లు, మూడ్ లైటింగ్ లాంటి ఫీచర్లు ప్రయాణాన్ని మరింత సుఖంగా మార్చేలా ఉంటాయి. ఇంటీరియర్ లో ప్రశాంత వాతావరణాన్ని కలిగించేలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
హ్యుందాయ్ డిజైనర్ సైమన్ లోస్బీ కొత్త కార్ల డిజైన్ గురించి కీలక వివరాలు వెల్లడించారు. ఈ కాన్సెప్ట్ లు కంపెనీకి చైనాలో కొత్త దిశను చూపించనున్నట్లు తెలిపారు. ఇతర కంపెనీలను అనుసరించడం కాకుండా, కొత్త కార్లను రూపొందించడం తమ లక్ష్యం అన్నారు. ఈ కార్లు చూడగానే గుర్తుపట్టేలా ఉండటం, వినియోగదారులకు ప్రత్యేక అనుభవాన్ని ఇవ్వడం ప్రధాన ఉద్దేశమన్నారు.
ఈ కాన్సెప్ట్ కార్లు ఎప్పుడు మార్కెట్ లోకి వస్తాయి? అనే వివరాలను కంపెనీ వెల్లడించలేదు. త్వరలో జరిగే బీజింగ్ మోటార్ షోలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. చైనా మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని హ్యుందాయ్ తీసుకొచ్చిన ఈ కొత్త ఆలోచనలు, భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహనాల రూపురేఖలను మార్చే అవకాశముంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా, కొత్త డిజైన్, టెక్నాలజీతో ముందుకు సాగాలని కంపెనీ ప్రయత్నిస్తున్నది.
Read Also: ఒకే ఛార్జ్ తో 350 మీ.. మార్కెట్లోకి అదిరిపోయే దేశీ ఎలక్ట్రిక్ కారు