మొబైల్ ఫోన్.. ఇప్పుడిది మన శరీరంలో ఒక అవయవంతో సమానం. దాన్ని పొరపాటు ఎక్కడైనా మరిచిపోతే.. ప్రాణం పోయేంతగా ఫీలైపోతాం. మరి మనల్ని అంతగా లోబరుచుకున్న ఆ మొబైల్ ఫోన్ను కనిపెట్టింది ఎవరో తెలుసా? అసలు అతడికి ఆ ఐడియా ఎలా వచ్చింది? తాను మొబైల్ ఫోన్ కనిపెట్టగానే.. ముందుగా ఎవరికి కాల్ చేశాడు? ఎందుకు చేశాడో తెలుసుకోవాలని ఉందా? ఇదిగో చదివేయండి.
మొబైల్ ఫోన్లు రాక ముందు.. కేవలం ల్యాండ్ లైన్లు మాత్రమే ఉండేవనే సంగతి తెలిసిందే. కొన్ని ఫోన్లకు వైర్ లెస్ కనెక్టివిటీ ఉండేది. అయితే.. ఆ ఫోన్లను బయటకు తీసుకెళ్లడం వీలయ్యేది కాదు. ఎందుకంటే.. వాటి నెట్ వర్క్ చాలా తక్కువ. కేవలం ఆ ఇంటి పరిసరాలకు మాత్రమే పరిమితం. కానీ.. అప్పట్లో కార్ ఫోన్లు ఉండేవి. అవి చాలా పెద్ద సైజు ఉండేవి. వాటిని మొబైల్ ఫోన్ల తరహాలో వెంట తీసుకెళ్లలేం. అందుకే అవి కాస్త చిన్నగా ఉంటే మనతోపాటే తీసుకెళ్ల వచ్చు కదా అని ఓ వ్యక్తికి అనిపించింది. అతనే.. మార్టిన్ కూపర్.
మార్టిన్ కూపర్.. మోటోరోలా సంస్థకు చెందిన ఉద్యోగి. 1970లో ‘బెల్ లాబ్స్’ అనే సంస్థ వైర్లెస్ సాంకేతికతపై పనిచేసేది. కార్లలో ఉండే ఫోన్లపై ఎక్కువగా ఫోకస్ పెట్టేది. అప్పట్లో బెల్ లాబ్స్, మోటోరోలా మధ్య భారీ కాంపిటీషన్ ఉండేది. ఆ సంస్థ కంటే ఒక మెట్టు ఎక్కువగా ఉండాలనే లక్ష్యంతో మోటోరోలా.. చేతిలో ఇమిడిపోయే మొబైల్ ఫోన్లను తయారు చేయాలని నిర్ణయించుకుంది. ఈ విషయం తెలిసి.. బెల్ లాబ్స్ కూడా మొబైల్ ఫోన్లపై ఫోకస్ పెట్టింది. అయితే, వాళ్ల కంటే ముందే 90 రోజుల్లోనే.. మార్టిన్ కూపర్ మొబైల్ ఫోన్ను తయారు చేసేశాడు. నిద్రాహారాలు లేకుండా శ్రమించి.. బెల్ లాబ్స్కు షాకిచ్చాడు.
మీరు కొత్తగా మొబైల్ ఫోన్ కొనుగోలు చేస్తే.. ఫస్ట్ కాల్ ఎవరికి చేయాలని అనుకుంటారు? మీకు నచ్చిన వ్యక్తి లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కదా. కానీ, మార్టిన్ కూపర్ అలా చేయలేదు. నేరుగా అతడి ప్రత్యర్థి, బెల్ లాబ్స్ హెడ్.. జోయెల్ ఎంగెల్కుకు కాల్ చేశాడు. ఏప్రిల్ 3, 1973న ప్రెస్ కాన్ఫిరెన్స్కు వెళ్లడానికి ముందు.. న్యూయార్క్ వీధుల్లో నడుస్తూ మార్టిన్ జోయెల్కు కాల్ చేశాడు. ‘‘జోయెల్ నేను మార్టిన్ కూపర్ మాట్లాడుతున్నా. నేను నిజమైన సెల్యూలర్ ఫోన్ తయారు చేసేశాను. ఒక పోర్టబుల్ మొబైల్ ఫోన్ నుంచి మాట్లాడుతున్నా’’ అని చెప్పాడు. అంతే.. జోయెల్కు గుండెలో రాయి పడినంత పనైంది. ఆ షాక్లో కాసేపు మాట్లాడలేకపోయాడట. చివరికి కంగ్రాట్స్ చెప్పాడు అనుకోండి.
మొదటి మొబైల్ ఫోన్ పేరు.. ‘మోటోరోలా డైనాటాక్’. దీని బరువు దాదాపు 1.1 కేజీలు. అంటే.. ఇప్పుడు నాలుగైదు ఫోన్లు కలిపితే ఎంత బరువు ఉంటుందో అంత. 9 అంగుళాల పొడవుండే ఈ ఫోన్ను మొదట్లో దీన్ని అంతా ఇటుక రాయి (The Brick) అని పిలిచేవారు. దీన్ని 10 గంటలు ఛార్జ్ చేస్తే.. కేవలం 30 నిమిషాలు మాత్రమే మాట్లాడేందుకు వీలయ్యేది. నెంబర్లు డయల్ చేయడం, మాట్లాడం.. వినడానికి మాత్రమే ఈ మొబైల్ ఫోన్ పనిచేసేది. స్క్రీన్ గానీ, మెసేజులు పంపే సదుపాయాలు గానీ లేవు.
మొబైల్ ఫోన్ను 1973లోనే కనిపెట్టారు. కానీ, ప్రభుత్వం నుంచి అనుమతులు రావడానికి, సాంకేతికతను మరింత మెరుగుపరచడానికి పదేళ్లు పట్టింది. 1983లో మొదటి కమర్షియల్ మొబైల్ ఫోన్ లాంచ్ అయ్యింది. అదే Motorola DynaTAC 8000X. అప్పట్లో దీని ధర.. 3,995 డాలర్లు. భారత కరెన్సీ ప్రకారం.. సుమారు రూ.8 లక్షలు. అందుకే, అప్పట్లో కోటీశ్వరులు మాత్రమే మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసేవారు. ఆ తర్వాత సామాన్యుల చేతికి కూడా చిక్కింది.
ఇటుకరాయి పరిమాణంలో ఉండే మొబైల్ ఫోన్.. ఇప్పుడు అరచేతిలో ఇమిడిపోయే సైజుకు చేరింది. కేవలం కీబోర్డులతో నడిచే ఈ ఫోన్.. క్రమేనా స్క్రీన్లు.. కెమేరాలతో మరింత స్మార్ట్గా మారిపోయింది. 1983 తర్వాత.. మొబైల్ ఫోన్లను చిన్నవిగా మార్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. 1992లో షార్ట్ మెసేజ్ సర్వీస్ (SMS) ద్వారా మెసేజులు ఇచ్చుపుచ్చుకొనే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. 1999లో మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ వాడకం మొదలైంది. 2007లో iPhone రాకతో ఫోన్లన్నీ ‘స్మార్ట్’గా మారడం మొదలైంది.
Also Read: వర్షాకాలంలో.. స్మార్ట్ఫోన్ తడిసినా పాడవకుండా ఉండాలా?