SRH: తరచూ వివాదాల్లో నిలిచే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ {హెచ్సీఏ} మరోసారి వార్తల్లో నిలిచింది. ఐపీఎల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ వింత పరిస్థితిని ఎదుర్కొంటుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుండి ఒత్తిడి ఎదుర్కోలేక, వేధింపులు తట్టుకోలేక హైదరాబాద్ నగరాన్ని వీడతామని సన్ రైజర్స్ యాజమాన్యం బాంబు పేల్చింది. ఉచిత టికెట్ల కోసం హెచ్సీఏ ఉన్నతాధికారులు, ముఖ్యంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు.. సన్రైజర్స్ హైదరాబాద్ ని బెదిరింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించింది ఎస్.ఆర్.హెచ్.
ఐపీఎల్ 2025 సందర్భంగా తాము కోరినన్ని ఫ్రీ పాసులు ఇవ్వనందుకు ఓ మ్యాచ్ లో తమకు కేటాయించిన కార్పొరేట్ బాక్స్ కి తాళాలు వేసినట్లు ఎస్ఆర్హెచ్ ప్రతినిధి ఒకరు హెచ్సీఏ కోశాధికారికి లేఖ రాశారు. ఇందుకు సంబంధించిన లేఖ తమ వద్ద ఉందని ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పెడుతున్న బాధలు ఇక పడలేమని, అందుకే తాము హైదరాబాద్ ని వదిలి వెళ్ళిపోతామని సన్రైజర్స్ హైదరాబాద్ చెబుతోంది.
ఈ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ కి ఆంధ్రప్రదేశ్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ కి రావాలని సన్రైజర్స్ హైదరాబాద్ కి ఫ్యాన్స్ స్వాగతం పలుకుతున్నారు. ఐపీఎల్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సొంత జట్టు లేకపోవడంతో హైదరాబాద్ జట్టునే సొంతం చేసుకొని అభిమానిస్తున్నారు ఏపీ ఫ్యాన్స్. అయితే తాజా వివాదంతో తమ రాష్ట్రానికి రావాలని వారు కోరుతున్నారు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్ లలో ఒకరిది ఆంధ్రప్రదేశ్ కావడంతో.. ప్రస్తుతం కొన్ని మ్యాచ్ లు విశాఖ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే.
ఇంతకీ సన్రైజర్స్ హైదరాబాద్ మేనేజర్ రాసిన లేఖలో ఏముందంటే.. ” ఐపీఎల్ ఉచిత టికెట్ల ఫ్రీ పాస్ ల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బెదిరింపులు తట్టుకోలేక ఈ లేఖ రాస్తున్నాం. గత రెండు సీజన్ల నుండి మాకు హెచ్సీఏ నుండి వేధింపులు వస్తున్నాయి. అగ్రిమెంట్ ప్రకారం హెచ్సీఏ కి 10 శాతం టికెట్లు అంటే 3900 కాంప్లిమెంటరీగా అందిస్తున్నాం. 50 సీటింగ్ కెపాసిటీ ఉన్న ఎఫ్ 12 ఏ కార్పొరేట్ బాక్స్ టికెట్లు సైతం అందులో భాగమే.
కానీ ఈ సీజన్ లో సీటింగ్ కెపాసిటీ 30 మాత్రమే ఉంది. కానీ అదనంగా మాకు 20 టికెట్లు కేటాయించాలని కోరారు. ఈ విషయంపై మాట్లాడదామని చెప్పినప్పటికీ గత మ్యాచ్ సమయంలో ఎఫ్3 బాక్స్ కి తాళాలు వేశారు. నిజానికి ఐపీఎల్ సమయంలో స్టేడియం మా కంట్రోల్ లోనే ఉంటుంది. స్టేడియానికి సైతం ఫ్రాంచైజీ అద్దె చెల్లిస్తోంది. మ్యాచ్ సమయంలో ఇలా బ్లాక్ మెయిల్ చేసి టికెట్ల కోసం వేధించడం సరైనది కాదు.
ఈ విషయంపై బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వంతో సన్రైజర్స్ యాజమాన్యం చర్చించి మరో వేదికకు మారిపోతాం. ఈ అంశంపై చర్చించేందుకు హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేయాలి ” అని సన్రైజర్స్ హైదరాబాద్ జనరల్ మేనేజర్ హెచ్సీఏ ట్రెజరర్ కు లేఖ రాశారు. ఈ క్రమంలోనే తమ రాష్ట్రానికి రావాలని ఆంధ్రప్రదేశ్ అభిమానులు కోరుతున్నారు.