FIFA World Cup : ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచ కప్ లో అర్జెంటీనా అదరగొడుతోంది. సూపర్ ఫామ్ లో ఉన్న ఆ జట్టు ఫైనల్ లోకి దూసుకెళ్లింది. క్రొయేషియాతో జరిగిన మ్యాచ్ లో అర్జెంటీనా స్టార్ మెస్సీ చెలరేగిపోయాడు. మెస్సీ మెరుపులతో సెమీ ఫైనల్ లో క్రొయేషియాను అర్జెంటీనా చిత్తు చేసింది. మంగళవారం అర్ధరాతి జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా 3-0 గోల్స్ తేడాతో క్రొయేషియాను ఓడించింది. దీంతో అర్జెంటీనా 8 ఏళ్ల తర్వాత ఫైనల్ లోకి ప్రవేశించింది. చివరిసారిగా ఆ జట్టు 2014 లో ఫైనల్లో అడుగుపెట్టింది.
ఈ మ్యాచ్లో ఆది నుంచి అర్జెంటీనా ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి అర్ధభాగంలో రెండు గోల్స్ చేసి మ్యాచ్ పై పట్టు సాధించింది. స్టార్ ఆటగాడు మెస్సీ పెనాల్టీ కిక్ ద్వారా 34వ నిమిషంలో తొలి గోల్ చేశాడు. ఆ తర్వాత అల్వారెజ్ 38 నిమిషంలో మరో గోల్ చేశాడు. దీంతో ఆ జట్టు తొలి అర్ధభాగంలో 2-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. రెండో అర్ధభాగంలో అర్జెంటీనా అదే దూకుడును ప్రదర్శించింది. అల్వారాజ్ 69వ నిమిషంలో మరో గోల్ కొట్టాడు. దీంతో 3-0 గోల్స్ తేడాతో క్రొయేషియాపై విజయం సాధించింది అర్జెంటీనా.
మెస్సీ తొలి గోల్ కొట్టి జట్టులో ఉత్సాహం నింపాడు. దీంతో అర్జెంటీనా ఆటగాళ్లు రెట్టించిన ఉత్సాహంతో మైదానంలో కదంతొక్కారు. క్రొయేషియాకు గోల్ గొట్టేందుకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆ జట్టు సెమీస్ లో ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. అర్జెంటీనా దూకుడు ముందు నిలవలేక సెమీస్ నుంచి క్రోయేషియా నిష్క్రమించింది.
బుధవారం అర్ధరాత్రి జరిగే రెండో సెమీ ఫైనల్ లో మొరాకో, ఫ్రాన్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టుతో డిసెంబర్ 18న అర్జెంటీనా ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది.