![WPL Auction](https://www.bigtvlive.com/wp-content/uploads/2023/12/5afc7100a2f28c963d7b1277e5e34856.jpg)
WPL Auction : 2024లో జరగనున్న మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ కోసం ముంబయిలో మినీ వేలం నిర్వహించారు. మొత్తం 165 మంది అమ్మాయిలు వేలంలో పాల్గొన్నారు. వీరిలో 104 మంది భారత క్రికెటర్లు, 61 మంది విదేశీయులు ఉన్నారు. ముంబై ఇండియన్స్ ఐదుగురు, ఢిల్లీ క్యాపిటల్స్ ముగ్గురు, గుజరాత్ జెయింట్స్ 10 మంది, ఆర్సీబీ ఏడుగురు, యూపీ వారియర్స్ ఐదుగురిని కొనుగోలు చేశారు.
అన్ సోల్డ్ క్యాటగిరీ నుంచి భారీ జాక్ పాట్
రూ. 40 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ అన్నాబెల్ సదర్లాండ్ ను రూ. 2 కోట్ల భారీ ధర పెట్టి ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేయడం సంచలనం సృష్టించింది. ముంబై వేదికగా జరిగిన వేలంలో ఈ ఆసీస్ యువ ఆల్రౌండర్ అందరి అంచనాలను మించి జాక్ పాట్ కొట్టింది.
ముఖ్యంగా అన్నాబెల్ విషయంలో ముంబై ఇండియన్స్ పోటీ పడటంతో వేలం అమాంతం పెరిగిపోయింది. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ప్రెస్టేజ్ గా తీసుకోవడంతో, ఇక వాళ్లు తగ్గేలా లేరని, ముంబై ఇండియన్స్ వెనక్కి తగ్గింది.
తాము జారవిడిచిన అన్నాబెల్ వేలంలో ఇంత ధర పలకడంతో గుజరాత్ జెయింట్స్ అధినేతలు తల పట్టుకున్నారు. ఎందుకంటే వారు రూ.70 లక్షలకే గత ఏడాది కొనుగోలు చేశారు. కానీ ఆశించిన మేర రాణించక పోవడంతో వదిలేశారు. కానీ ఇంత ధర పలుకుతుందని ఊహించలేదు.
మహిళల బిగ్బాష్ లీగ్లో 304 పరుగులు చేయడమే కాదు 21 వికెట్లు పడగొట్టిన అన్నాబెల్ అందరి ద్రష్టి ఆకర్షించింది.
హ్యాట్రిక్ తో బంపర్ ఆఫర్ కొట్టిన కాశ్వీ గౌతమ్
భారత ప్లేయర్ కాశ్వీ గౌతమ్ కూడా రూ.2 కోట్ల భారీ ధర పలకడం విశేషం. రూ. 10 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన తనని గుజరాత్ జెయింట్స్ రూ. 2 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.
ఈమె కోసం గుజరాత్ జెయింట్స్తో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ తీవ్రంగా పోటీ పడ్డాయి.
భారత క్రీడాకారిణుల్లో అత్యధిక ధర పలికిన ప్లేయర్గా కాశ్వీ గౌతమ్ నిలిచింది.
రైట్ ఆర్మ్ పేసర్ అయిన కాశ్వీ గౌతమ్.. బ్యాట్తో కూడా బిగ్ షాట్స్ ఆడగలదు. ఆల్ రౌండర్ గా పేరుపొందింది. అండర్-19 దేశవాళీ క్రికెట్లో కాశ్వీ గౌతమ్ హ్యాట్రిక్తో అందరి దృష్టి ఆకర్షించింది. అరుణాచల్ ప్రదేశ్, చంఢీగర్ మధ్య జరిగిన మ్యాచ్లో కాశ్వీ ఈ ఫీట్ సాధించింది. అంతేకాదు హ్యాట్రిక్తో పాటు మొత్తం పది వికెట్లు పడగొట్టింది. బ్యాట్తో 49 పరుగులు చేసి, చండీగర్ టీమ్ లో తనేమిటో నిరూపించింది.
యూపీ వారియర్స్ వచ్చి వ్రిందా దినేష్ ను రూ.1.3 కోట్ల కు కొనుగోలు చేసి ఆశ్చర్యపరిచింది.
అలాగే టీమిండియా ప్లేయర్ ఏక్తా బిస్త్ ను ఆర్సీబీ రూ. 60 లక్షలకు సొంతం చేసుకుంది.
ఇంగ్లాండ్ పేసర్ కేట్ క్రాస్ ను బేస్ ధర రూ .30 లక్షలకు బెంగళూరు సొంతం చేసుకుంది.
భారత జట్టులో కీలక ఆల్ రౌండర్ గా ఉన్న దేవిక వైద్యను ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. ఆరంభ సీజన్ లో యూపీ వారియర్స్ రూ.1.4 కోట్లు పెట్టి దక్కించుకుంది. కానీ ఆశించిన మేర రాణించకపోవడంతో వదులుకున్నారు.
ఎంతో ఎక్స్ పెక్టేషన్స్ మధ్య నిలిచిన ఆసిస్ ఆల్ రౌండర్ కిమ్ గార్థ్ ( రూ.50 లక్షలు), వెస్టిండీస్ ఆల్ రౌండర్ డాటిన్ (రూ.50 లక్షలు), శ్రీలంక ఆల్ రౌండర్ చమరి ఆటపట్టు (రూ.30 లక్షలు) తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు.
అలాగే భారత క్రికెటర్లు సుష్మ వర్మ, మోనా మెష్రామ్, వేద కృష్ణ మూర్తి, పూనమ్ రౌత్, దేవికా వైద్య, ఎస్ మేఘన, భారతి ఫుల్మాలి తదితరులకు నిరాశ ఎదురైంది. వీరి కోసం ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించ లేదు. ఫైనల్ రౌండ్ వేలంలో అవకాశం వస్తుందో లేదో చూడాల్సిందే.