Chepauk Stadium: ముత్తయ్య అన్నామలై చిదంబరం స్టేడియం.. దీన్నే చెపాక్ స్టేడియం అని కూడా అంటారు. ఈ చెపాక్ స్టేడియం చెన్నైలో ఉంది. ఈ స్టేడియాన్ని 1916లో నిర్మించారు. ఇది కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ తర్వాత దేశంలో రెండవ పురాతన క్రికెట్ స్టేడియం. గతంలో మద్రాస్ క్రికెట్ క్లబ్ గ్రౌండ్ గా పిలిచే ఈ స్టేడియంకి.. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అధిపతి ఎం.ఏ చిదంబరం చెట్టియార్ పేరు పెట్టారు.
Also Read: HCA – SRH: HCA లో వరుస అరెస్టులు…ఐపీఎల్ 2026 నుంచి SRH ఔట్… గందరగోళంలో అభిమానులు?
మన దేశంలోని పురాతన స్టేడియాలలో ఈ ఎం.ఏ చిదంబరం స్టేడియం ఒకటి. ఈ చెపాక్ స్టేడియం తమిళనాడు క్రికెట్ జట్టు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కి హోం గ్రౌండ్. ఈ స్టేడియంలో 1934 ఫిబ్రవరి 10న మొదటి టెస్ట్ మ్యాచ్, 1936లో మొదటి రంజీ ట్రోఫీ మ్యాచ్ నిర్వహించారు. ఇక 1952 లో ఇంగ్లాండ్ పై భారత క్రికెట్ జట్టు సాధించిన టెస్ట్ విజయం.. ఈ మైదానంలో మొదటిది. బంగాళాఖాతం వెంబడి మెరీనా బీచ్ నుండి కొన్ని వందల మీటర్ల దూరంలో ఈ స్టేడియం ఉంది.
చెపాక్ పిచ్
ఈ చెపాక్ పిచ్ సాధారణంగా స్పిన్ కి బాగా అనుకూలిస్తుంది. ఫార్మాట్ ఏదైనా ఇక్కడ టర్నింగ్ ట్రాక్స్ ఎదురవుతాయి. దీనిని ఉపయోగించుకొని క్వాలిటీ అటాక్ తో బరిలోకి దిగుతూ.. ప్రత్యర్థులకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తూ వస్తుంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. అయితే 17 ఏళ్లుగా సీఎస్కే కి అడ్డాగా ఉన్న ఈ చెపాక్ మైదానం ఇప్పుడు చెల్లాచెదురైంది. చెపాక్ లో సీఎస్కే పై మ్యాచ్ అంటే ఆల్మోస్ట్ అవతలి జట్టు ఓడిపోయినట్టే. కానీ అదంతా ఒకప్పుడు.
చెన్నై రికార్డులకు బీటలు
2025 ఐపీఎల్ లో మాత్రం ఇక్కడ చెన్నై రికార్డులకు బీటలు వారాయి. ఐపీఎల్ 2025 లో చెన్నై సూపర్ కింగ్స్ దారుణ ప్రదర్శనతో సీజన్ నుంచి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఈ సీజన్ లో పది మ్యాచ్ లు ఆడిన చెన్నై.. కేవలం రెండు మ్యాచ్ లు మాత్రమే గెలిచి, మిగతా ఎనిమిది మ్యాచ్ లలో ఓడిపోయింది. అందులో ఐదు మ్యాచ్ లు చెపాక్ స్టేడియంలోనే ఓడిపోయింది. ఇలా ఐదు మ్యాచ్లు ఓడిపోవడం ఇదే మొదటిసారి. ఆర్సిబి తో మొదలైన సీఎస్కే పతనం.. కొనసాగుతూ వచ్చింది. ఐపీఎల్ చరిత్రలో చెపాక్ లో ఆర్సీబీ 17 ఏళ్ల తర్వాత విజయం సాధించింది. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 15 ఏళ్ల తర్వాత చెపాక్ స్టేడియంలో చెన్నైని ఓడించింది.
ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఐపీఎల్ చరిత్రలో చెపాక్ మైదానంలో తొలి విజయాన్ని నమోదు చేసింది. అనంతరం కలకత్తా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు కూడా చెన్నై పై గెలుపొందాయి. అయితే ఇప్పుడు చెపాక్ మైదానం యొక్క డిజైన్ ని మార్చుతున్నారు. ఈ మేరకు చెపాక్ మైదానంలో పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలో చెన్నై మైదానాన్ని పూర్తిగా తొలగిస్తున్నారా..? అంటూ అభిమానులు కంగారు పడుతున్నారు. కానీ పూర్తిగా పిచ్ కండిషన్స్ ని, అలాగే ఇతర నిర్మాణ పనులను చేపడుతున్నారు.