If Gautham Becomes a Coach will there be Problems for Virat Kohli: టీమ్ ఇండియాకి హెడ్ కోచ్ గా గౌతం గంభీర్ వస్తున్నాడనే వార్తలతో నెట్టిల్లు హోరెత్తిపోతోంది. మరి తను వస్తే జట్టుకి వచ్చిన ఇబ్బందులైతే లేవు.. అంతేకాకుండా కెప్టెన్ రోహిత్ శర్మకి తను మంచి మిత్రుడు కూడా. కానీ ఎటొచ్చి విరాట్ కోహ్లీతోనే సమస్యని అంటున్నారు. ఎందుకంటే హెడ్ కోచ్ లు సరిగ్గా లేక అద్భుతమైన క్రీడాకారులు తెరమరుగైపోయిన సంఘటనలు ఉన్నాయి.
అలాంటివారిలో ప్రథమ వరుసలో టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఒకరని చెప్పాలి. అప్పటివరకు టీమ్ ఇండియా కెప్టెన్ గా ఒక వెలుగు వెలిగిన సౌరభ్ గంగూలీకి- కోచ్ గ్రెగ్ చాపెల్ మధ్య వచ్చిన వివాదం కారణంగా తను కెప్టెన్సీ కోల్పోయాడు. ఇదే సమయంలో తను ఫామ్ కోల్పోవడంతో తిరిగి జట్టులోకి రావడానికి ఎంతో శ్రమించాడు. కెప్టెన్సీ కోల్పోవడంతో కోల్ కతాలో ప్రజల ఆగ్రహాన్ని బీసీసీఐ చవిచూడాల్సి వచ్చింది.
ఆస్ట్రేలియా కోచ్ గ్రెగ్ చాపెల్ ఒకసారి వీరేంద్ర సెహ్వాగ్ ని కొట్టాడనే వార్తలు వచ్చాయి. తను పనిచేసింది రెండేళ్లయినా ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచాడు. సౌరభ్ గంగూలి, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి వారి ఆట లయ తప్పింది. అలాగే పలువురు కోచ్ ల కారణంగా ఎంతోమంది క్రీడాకారులు జట్టు నుంచి తెరమరుగయ్యారు.
ప్రస్తుతం ఇంత చర్చ ఎందుకంటే, గౌతం గంభీర్ కోచ్ గా వస్తుంటే, విరాట్ కోహ్లీ తో ఎలా ఉంటాడనే చర్చలు నెట్టింట తీవ్రంగా నడుస్తున్నాయి. అయితే ఇటీవల విరాట్ కోహ్లీ కొన్నాళ్లు అజ్నాతంలో ఉండి, మళ్లీ ఐపీఎల్ మ్యాచ్ లకి వెళ్లినప్పుడు ఆర్బీసీ వర్సెస్ కోల్ కతా మ్యాచ్ సందర్భంగా గౌతమ్ వెళ్లి ప్రత్యేకంగా కోహ్లీని పలకరించాడు. దీంతో ఇద్దరూ ఆత్మయంగా కాసేపు మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో హమ్మయ్యా వారిద్దరి మధ్యా విభేదాలు సర్దుకున్నాయని అనుకున్నారు.
ఇప్పుడు గౌతం గంభీర్ వచ్చినా, అవేవీ ఉండవని అంటున్నారు. అసలు గంభీర్ మధ్య కోహ్లీ గొడవేమిటి? అని అంతా గుర్తు చేసుకుంటున్నారు. ఐపీఎల్ 2023 సీజన్ లో లక్నో వర్సెస్ ఆర్సబీ మధ్య మ్యాచ్ జరిగింది. లక్నో బౌలర్ నవీన్ ఉల్ హక్తో కోహ్లీ వాగ్వాదానికి దిగిన వీడియో ఒకటి హల్చల్ చేసింది.
లక్నో బ్యాటింగ్ 17వ ఓవర్లో ఈ పోరు మొదలైంది. అప్పటికి లక్నో 8 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసింది. క్రీజులో అమిత్ మిశ్రా, నవీల్ ఉల్ హక్ ఉన్నారు. ఆర్సీబీ నుంచి సిరాజ్ బౌలింగ్ కి వచ్చాడు. చివరి బంతికి ఫ్రీ హిట్ అయింది. అది డాట్ బాల్ అయింది. సిరాజ్ కుదురుగా ఉండకుండా.. నవీన్ క్రీజులోనే ఉన్నా.. బంతిని వికెట్ పైకి విసిరాడు.
ఈ సందర్భంగా సిరాజ్-నవీన్ మధ్య మాటల వాగ్వాదం జరిగింది. అప్పుడు విరాట్ కోహ్లీ కూడా జోక్యం చేసుకున్నాడు. అది చినికి చినికి గాలివాన అయ్యింది. కొహ్లీ కుదురుగా ఉండకుండా తన షూ లేస్ చూపించాడు. దాంతో నవీన్ కి కాలిపోయింది.
Also Read: నామమాత్రపు మ్యాచ్ లో.. ఘనంగా గెలిచిన శ్రీలంక
గ్రౌండ్ లో విషయాలన్నీ తెలుసుకున్న గౌతంగంభీర్ వచ్చి విరాట్ తో గొడవ వేసుకున్నాడు. ఇదే వారి మధ్య వివాదం. కానీ ఈగొడవకి ప్రత్యక్షంగా వీరిద్దరికీ సంబంధం లేదు. అది సిరాజ్ వర్సెస్ నవీన్ మధ్య గొడవ.. వీళ్లు కల్పించుకుని పెద్దది చేసుకున్నారు. అయితే ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు కోహ్లీ, గంభీర్, నవీన్లకు జరిమానా విధించింది.
కానీ తాజాగా జరిగిన 2024 ఐపీఎల్ లో వీరిద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. అందువల్ల గౌతంగంభీర్ కోచ్ అయినా వచ్చిన నష్టం లేదని అంటున్నారు. ఓకే కానీ, ఇప్పుడు టీ 20 ప్రపంచకప్ లో ఓపెనర్ గా వెళ్లి కొహ్లీ ఇలా అవుట్ అయిపోతుంటే, మరి గంభీర్ ఏమీ అనకుండా చూస్తూ ఉంటాడా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
ఒకవేళ అంటే, పాత పగని మనసులో పెట్టుకుని అంటున్నాడంటే ఏం అనుకోవాలని మరికొందరు అంటున్నారు. నిజమే మరి. ఇది కోహ్లీకి విషమపరీక్ష కిందే లెక్క. అయితే తన ఆట తను ఆడుకుని వెళ్లిపోయినంత కాలం కోహ్లీకి వచ్చిన సమస్య ఉండదని మరికొందరు అంటున్నారు. కోహ్లీ కూడా ఇంకెంతో కాలం క్రికెట్ ఆడడని మరికొందరు అంటున్నారు. మరేం జరుగుతుందో వేచి చూడాల్సిందే.