Gautam Gambhir appointed head coach of India men’s team: టీమిండియా ప్రధాన కోచ్గా టీమిండియా వెటరన్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ నియమితులయ్యారు. ఈ మేరకు బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జై షా అధికారికంగా ప్రకటించారు. ఈ నెలఖరున ప్రారంభం కానున్న శ్రీలంక పర్యటనకు ఈ వారంలోనే జట్టు ప్రకటించాల్సి ఉంది. అయితే ఈ పర్యటన నుంచే గంభీర్ కోచ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
రాహుల్ ద్రవిడ్ స్థానంలో టీమిండియా కోచ్గా బాధ్యతలు అందుకోనున్న గంభీర్..భారీగా జీతాన్ని డిమాండ్ చేసినట్లు సమాచారం. అంతకుముందు రాహుల్ ద్రవిడ్ ఏడాదికి రూ.12కోట్ల జీతాన్ని తీసుకున్నాడు. కానీ అంతకంటే ఎక్కువ మొత్తంలో గంభీర్ కోరినట్లు తెలుస్తోంది. కాగా, ఈ విషయంపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుందో తెలియదు. రెండేళ్లు గంభీర్ హెడ్ కోచ్గా కొనసాగనున్నారు. అయితే ఈ సమయంలో గంభీర్..ఐపీఎల్ వంటి ఖరీదైన లీగులలో ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం ఉండదు. అందుకే కేకేఆర్ మెంటార్ పదవిని కూడా గంభీర్ వదిలేశాడు.
టీ20 ప్రపంచకప్తో ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం జూన్ 30వ తేదీన ముగిసింది. అయితే కోచ్ కోసం దరఖాస్తులను బీసీసీఐ ఆహ్వానించింది. ఈ నేపథ్యంలోనే గంభీర్ దరఖాస్తు చేసుకొని ఇంటర్వ్యూకు సైతం హాజరైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయనను హెడ్ కోచ్గా నియమించింది. దీంతోపాటు సహాయక కోచ్ల ఎంపిక విషయంలోనూ బీసీసీఐ గంభీర్కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తోంది.
2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ విజేత అయిన గంభీర్..ఐపీఎల్లోనూ విజయవంతమైన కెప్టెన్గానే కాకుండా మెంటార్గానూ సక్సెస్ అయ్యాడు. క్రికెట్ కెరీర్లో జట్టు కోసం ఎన్నో పాత్రలు పోషించిన గంభీర్..ఇండియన్ క్రికెట్ను మరింత ముందుకు తీసుకెళ్తారన్న నమ్మకం ఉందని జైషా పేర్కొన్నారు.
Also Read: భారత క్రికెట్ ప్లేయర్ సిరాజ్ని సన్మానించిన సీఎం
టీమిండియా హెడ్ కోచ్గా నియమించడంపై గంభీర్ ఎక్స్ వేదికగా స్పందించాడు. ‘దేశమే నా గుర్తింపు. దేశానికి సేవ చేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నా. ఇతర రంగాల్లోకి వెళ్లినా చివరికి మళ్లీ సొంతగూటికి రావడం గర్వంగా ఉంది. ప్రతి భారతీయుడు గౌరవంగా తలెత్తుకునేలా చేయడమే నా ముందున్న లక్ష్యం. 140 కోట్ల మంది భారతీయుల కలలను నీలం రంగు జెర్సీలు ధరించిన ఆటగాళ్లు మోస్తున్నారు. అందరి కలలను నిజం చేయడానికి అన్ని విధాలుగా కృషి చేస్తా.’అంటూ గంభీర్ ట్వీట్ చేశారు.