MI Captain Hardik Pandya Bowling Doubts: జూన్ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్కి జట్టు ఎంపికకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఐపీఎల్ 2024 టోర్నీని జాగ్రత్తగా గమనిస్తోంది. ఈసారి ఎక్కువమంది ఆల్రౌండర్లను ఎంపిక చేయాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే మ్యాచ్లను దగ్గరుండి పరిశీలిస్తోంది. ఐపీఎల్లో ఎంతమంది ఆల్ రౌండర్లు ఉన్నారు? విదేశీ బౌలింగ్ను ఎవరు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు? ఇలా అనేక అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
గాయాల తర్వాత ఐపీఎల్ ఆడుతున్న ఆల్రౌండర్ హార్థిక్పాండ్యా ఆటతీరుపై విమర్శలు తీవ్రమయ్యాయి. పాండ్యా ఫామ్పై ఆటగాళ్లలో కొంత గందరగోళం నెలకొంది. భారీగా పరుగులు ప్రత్యర్థులకు ఇవ్వడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మాజీ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, మనోజ్తివారీలు ఆయన ఆటతీరు బాగాలేదని ఓపెన్గా చెప్పేశారు.
పరిస్థితి గమనించిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. హార్ధిక్ పాండ్యా చేత ఎక్కువగా బౌలింగ్ చేయించాలని నిర్ణయానికి వచ్చినట్టు ముంబై సమాచారం. టీమిండియా కెప్టెన్ రోహిత్శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. ఇకపై జరగనున్న ప్రతీ మ్యాచ్లోనూ పాండ్యా చేత కచ్చితంగా బౌలింగ్ చేయాలని భావించినట్టు సమాచారం.
పొట్టి వరల్డ్కప్ రేసులో శివమ్దూబేతోపాటు మరికొందరు ఆటగాళ్లు ఉన్నాడు. ఈసారి ఐపీఎల్ టోర్నమెంట్ లో చాలామంది కొత్త ఆటగాళ్లు రాణిస్తున్నారు. మొత్తానికి ఐపీఎల్ టోర్నీ ముగిసేనాటికి టీ20కి ఎవరు అర్హత సాధిస్తారో చూడాలి.