Yash Dayal : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బౌలర్ యశ్ దయాల్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. లైంగిక వేధింపుల కారణంగా ఉత్తరప్రదేశ్ లో ఘజియాబాద్ కి చెందిన ఓ యువతి యశ్ దయాల్ పై కేసు పెట్టింది. దీంతో ప్రాథమిక విచారణ తరువాత దయాల్ పై FIR కూడా నమోదు అయింది. ప్రస్తుతం అతని కెరీర్ ప్రమాదంలో ఉంది. ఇక ఆ యువతి యశ్ దయాల్ గురించి చెబుతూ.. మేము ఇద్దరం 2019లో సోషల్ మీడియా ద్వారా కలిశామని.. అప్పటి నుంచి చాలా క్లోజ్ గా ఉన్నామని పేర్కొంది. ఈ సన్నిహిత్యం తో పాటు యశ్ దయాల్ నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలు ప్రాంతాలకు తీసుకెళ్లి శారీరక సంబంధాన్ని కొనసాగించాడని తెలిపింది. అలాగే కెరీర్ లో స్థిర పడిన తరువాత పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు తనను బ్లాక్ చేశాడని ఆరోపించింది.
Also Read : King Charles – India team : భారత క్రికెటర్లతో బ్రిటన్ కింగ్… గూస్ బంప్స్ రావాల్సిందే
అది కరెక్ట్ కాదు..
ఇక వీటితో పాటు యశ్ తో దిగిన ఫొటోలు, చాట్ లు, వీడియో కాల్స్ ని ఫిర్యాదులో జత చేసింది. మరో మహిళ నుంచి కూడా డబ్బు తీసుకున్నాడని తెలిపింది. ఇదిలా ఉండగా.. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న రాయల్ ఛాలెంజర్స్ ఆటగాడు యశ్ దయాల్ కి అలహాబాద్ కోర్టులో ఊరట లభించింది. తదుపరి విచారణ వరకు యశ్ ను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. ఒకటి రెండు రోజులు అంటే మోసపోయి ఉండవచ్చు. కానీ ఐదేళ్లు రిలేషన్ లో ఉండి మోసపోయాననడం సరికాదని జస్టిస్ సిద్దార్థ్ వర్మ, జస్టిస్ అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ యశ్ పై కేసు పెట్టిన విషయం తెలిసిందే.
బాధితురాలి స్పందన కూడా అవసరం : కోర్టు
యశ్ దయాల్ తరుపున న్యాయవాది గౌరవ్ త్రిపాఠి వాదనలు వినిపించారు. విచారణ సమయంలో హైకోర్టు ఓ ముఖ్యమైన వ్యాఖ్యలు చేసింది. ఇద్దరూ ఐదు సంవత్సరాల పాటు రిలేషన్ షిప్ లో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటానని నమ్మించి సంబంధం పెట్టుకున్నారని అనడం సరికాదని కోర్టు పేర్కొంది. ఈ విషయంలో ఫిర్యాదు చేసిన బాధితురాలి స్పందన కూడా అవసరం అని కోర్టు అభిప్రాయపడింది. కోర్టు బాధితురాలుకి నోటీస్ జారీ చేసి.. ఆమె నుంచి వివరణ కోరింది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఈ కేసులో తమ వాదనలు వినిపించాలని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ నాలుగు నుంచి ఆరు వారాల్లో జరుగనుంది. యశ్ దయాల్ పై ఘజియాబాద్ లోని ఇందిరాపురం పోలీస్ స్టేషన్ లో లైంగిక వేధింపుల కేసు నమోదు అయింది. ఈ FIR భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 69 కింద కేసు నమోదు చేశారు.