Mega Tournaments : ఈ టైటిల్ ఎవరికి సూటవుతుందని అనుకుంటున్నారా? ఇంకెవరికి… ఈ టైటిల్ సరిగ్గా సూటయ్యేది టీమిండియాకే. ఎందుకంటే… గత రెండేళ్లుగా అన్ని ద్వైపాక్షిక సిరీస్ల్లోనూ అదగొడుతున్న భారత క్రికెటర్లు… మెగా టోర్నీల దగ్గరికి వచ్చేసరికి బొక్కబోర్లా పడుతున్నారు. ఒత్తిడి వల్లో, కీలక ఆటగాళ్లు దూరం కావడం వల్లో తెలీదు కానీ… అన్ని ఐసీసీ టోర్నీల్లో భారత జట్టుకు పరాభవమే ఎదురవుతోంది.
ఇటీవల టీమిండియా ఆడిన T20 సిరీస్ల లెక్క తీస్తే… స్వదేశంలో వెస్టిండీస్పై 3-0 తేడాతో, శ్రీలంకపై 3-0 తేడాతో గెలిచి క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు… ఆ తర్వాత ఐర్లాండ్ పర్యటనలోనూ 2-0 తేడాతో సిరీస్ గెలుచుకుంది. ఆ వెంటనే ఇంగ్లండ్తో జరిగిన 3 మ్యాచ్ల సిరీస్ను కూడా 2-1 తేడాతో పట్టేసింది. కరీబియన్ గడ్డపైనా 5 మ్యాచ్ల సిరీస్ను 4-1 తేడా కైవసం చేసుకుని అదరగొట్టింది. T20 వరల్డ్కప్కు ముందు… ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలపై 2-1 తేడాతో వరుస సిరీస్ల్లో నెగ్గింది. తాజాగా న్యూజిలాండ్తో జరిగిన 3 మ్యాచ్ల సిరీస్ను కూడా 1-0 తేడాతో కైవసం చేసుకుంది. మొత్తమ్మీద ఏడాది వ్యవధిలో ఆడిన 8 సిరీస్ల్లోనూ నెగ్గి, ద్వైపాక్షిక సిరీస్ల్లో తిరుగులేని జట్టుగా నిలిచింది… టీమిండియా. కానీ, ఇదే జోరు మెగా టోర్నీల్లో మాత్రం చూపలేకపోతోంది.
ఆ మధ్య ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన టీమిండియా… 2021 T20 వరల్డ్కప్లోనూ దారుణ ఆటతీరు ప్రదర్శించింది. ఆ టోర్నీలో తొలి మ్యాచ్లోనే పాక్ చేతుల్లో ఓడి సూపర్-4కు దశకు కూడా వెళ్లలేకపోయింది. ఆ తర్వాత ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో జరిగిన ఆసియా కప్లోనూ సూపర్-4 దశలోనే నిష్క్రమించింది. ఇక తాజాగా ముగిసిన టీ20 వరల్డ్కప్లో సూపర్-12లో అదరగొట్టిన టీమిండియా… సెమీస్లో ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. దాంతో అభిమానులు… సిరీస్ల్లో హీరోలు.. మెగా టోర్నీల్లో జీరోలు అని భారత క్రికెటర్లపై సెటైర్లు వేస్తున్నారు.