
India vs Netherlands : సరిగ్గా దీపావళి రోజున నెదర్లాండ్స్ తో ఇండియా తలపడనుంది. వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఆదివారం నాడు రెండు జట్లు ఆఖరి లీగ్ మ్యాచ్ లు ఆడనున్నాయి. ఇప్పటికే నెదర్లాండ్స్ ఇంటి దారి పట్టగా, వరుసగా ఎనిమిదికి ఎనిమిది మ్యాచ్ లు గెలిచిన ఇండియా రెట్టింపు ఉత్సాహంతో ఆఖరి మ్యాచ్ ను కూడా గెలిచి సగర్వంగా సెమీస్ లో అడుగు పెట్టాలని చూస్తోంది.
బెంగళూరులోని చిన్నస్వామి స్డేడియంలో మ్యాచ్ మధ్యాహ్నం ప్రారంభం కానుంది. అయితే అదేరోజు దీపావళి కావడంతో స్టేడియంలో మ్యాచ్ చూడాలా? లేక టీవీల ముందు మ్యాచ్ చూడాలా? ఇంట్లో పండగే చేయాలా? టపాసులే కాల్చాలా? అనే మీమాంశలో క్రికెట్ అభిమానులు నలిగిపోతున్నారు. ఇండియన్స్ కొట్టే మెరుపులే టపాసులు అని కొందరంటున్నారు. మనం ఇంట్లో కాల్చే బాంబులకి వచ్చే శబ్ధం కన్నా, క్రికెట్ గ్రౌండ్ లో మనవాళ్లు కోట్టే ఫోర్లకే ఎక్కువ రీసౌండ్ వస్తుందని అంటున్నారు.
ఇక థౌజండ్ వాలా ఇచ్చే రెండు నిమిషాల శబ్ధం కన్నా, మనవాళ్లు కొట్టే సిక్సర్లకు స్టేడియంలో కొట్టే క్లాప్స్ టెన్ థౌజండ్ వాలా కన్నా ఎక్కువని అంటున్నారు. అలాగే ప్రత్యర్థుల వికెట్లు తీసినప్పుడు…అందరి ముఖాలపై వెలిగే ఆనందమే మతాబులని అంటున్నారు. తుర్రుమని వెళ్లే సిసింద్రీల్లాంటివి మనవాళ్లు చేసి సింగిల్స్ అని అంటున్నారు.
భూమ్మీద భూచక్రాల్లా గిర్రుమని తిరుగుతూ, డైవ్ లు చేస్తూ అందుకునే క్యాచ్ ల ముందు అవెంత? అంటున్నారు. ఆఖరికి విజయం సాధించినప్పుడు రివ్వున ఆకాశమంత ఎత్తు ఎగసే 140 కోట్ల భారతీయుల ఆనందం ముందు తారాజువ్వలు సరిపోతాయా? అంటున్నారు. అందుకని దీపావళి కన్నా, మన ఇండియా ఆడే మ్యాచ్ ఎక్కువ మజానిస్తుందని అంటున్నారు. అందుకే పండగచేస్కోండి అంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
అయితే ఇప్పుడిక్కడ చాలా రికార్డులు మనవారి కోసం ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా విరాట్ కోహ్లీ గానీ, నెదర్లాండ్స్ పై సెంచరీ చేశాడంటే, సచిన్ రికార్డ్ ని దాటి వెళ్లిపోయినట్టే. మళ్లీ ఇలాంటి అవకాశం ఇప్పుడప్పుడే రాకపోవచ్చునని అంటున్నారు. తర్వాత సెమీస్, ఆ తర్వాత ఫైనల్ లో ఎంత జాగర్తగా ఆడినా, అవసరమైనప్పుడు బ్యాట్ ఝులిపించాల్సి ఉంటుంది. ఆ క్రమంలో ఎక్కడైనా రాంగ్ కనెక్ట్ అయితే క్యాచ్ అవుట్ అయిపోతాడు. అదే నెదర్లాండ్ తో అయితే టెన్షన్ లేదు.
పాయింట్ల టేబుల్ పట్టికలో టాప్ వన్ స్థానానికి ఢోకాలేదు. తాపీగా, హాయిగా, ఆనందంగా, ఆడుతూ పాడుతూ ఆడుకోవచ్చునని కోహ్లీకి సలహా ఇస్తున్నారు. అయితే మొన్నటికి మొన్న ఆఫ్గాన్ ని చిన్నచూపు చూసి పీకలమీదకు తెచ్చుకున్న ఆస్ట్రేలియా తరహాలో ఆడవద్దని హెచ్చరిస్తున్నారు. ఆల్రడీ సౌతాఫ్రికాకి నెదర్లాండ్ ఝలక్ ఇచ్చిందనే సంగతి మరువద్దనే అంటున్నారు. ప్రశాంతంగా ఆడండి. అశేష క్రికెట్ అభిమానులకు దీపావళి పండగ బొనంజా ఇవ్వమని కోరుతున్నారు. అదే అభిమానులకు అసలైన పండుగ, నిజమైన ఆనందమని అంటున్నారు. మరి పండగ చేస్కుంటారు కదా…