IPL’s Brand Value: ఇండియన్ ప్రీమియర్ లీగ్{ ఐపీఎల్} క్రేజ్, పాపులారిటీ ఏటికేడు మరింత పెరుగుతూ పోతుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ ఆవిర్భవించి 17 ఏళ్లు గడిచి ఇప్పుడు 18వ సీజన్ కొనసాగుతున్నప్పటికీ.. ఆదరణ విషయంలో తగ్గేదేలే అంటూ దూసుకెళ్తుంది. అందుకు తగ్గట్లే ఈ లీగ్ బ్రాండ్ వాల్యూ కూడా అంతకంతకు పెరుగుతూ పోతోంది. 2008లో ప్రారంభమైన ఈ ఐపీఎల్.. క్రికెట్లో అతిపెద్ద లీగ్ హవా నడిపిస్తోంది.
Also Read: Jofra Archer: ఐపీఎల్ చరిత్రలో చెత్త బౌలర్ గా ఆర్చర్ రికార్డ్…?
అలాంటి ఐపీఎల్ బ్రాండ్ విలువ ఎంతో ఊహించడం కూడా కష్టమే. 2008 సంవత్సరంలో ప్రారంభమైన ఈ టి-20 లీగ్ బ్రాండ్ విలువ రోజు రోజుకు పెరుగుతూ.. ఇప్పుడు దీని విలువ 433% పెరిగింది. దీని కారణంగా ఇది క్రికెట్ ని మాత్రమే కాకుండా అనేక ఇతర క్రీడల ప్రసిద్ధ లీగ్ లను కూడా ఓడించి ప్రపంచంలోని అగ్రశ్రేణి లీగ్ లలో ఒకటిగా పేరుగాంచింది. 2008లో ఈ లీగ్ ప్రారంభమైనప్పుడు దీని విలువ 2,900 కోట్లు. అప్పుడు ఈ లీగ్ లో 8 జట్లు ఉండేవి.
ఇక 2022 సంవత్సరం నుండి ఐపీఎల్ లో మరో రెండు జట్ల చేరికతో పది జట్లుగా మారాయి. ఈ రెండు జట్లు ఏర్పాటు అయిన సంవత్సరానికి ఖర్చు 1275 కోట్లు. దీని కారణంగా ఐపీఎల్ బ్రాండ్ విలువ ప్రతి ఏడాది పెరుగుతూ ఇప్పుడు.. కొన్ని మీడియా నివేదికల ప్రకారం ఐపీఎల్ బ్రాండ్ విలువ 2024 లో ఒక లక్ష కోట్లను దాటింది. ఈ టోర్నీలో పాల్గొంటున్న పది జట్ల సమిష్టి ఆదాయం 2024లో రూ. 6,797 కోట్లుగా నమోదయింది.
అదే సమయంలో ఐపీఎల్ సమిష్టి బ్రాండ్ విలువ 13 శాతం పెరిగి 12 బిలియన్ డాలర్లకు.. అనగా రూ. 1,027, 976,000 చేరుకుందని సమాచారం. 2009లో దాదాపు 17వేల కోట్ల బ్రాండ్ విలువ కలిగిన ఈ లీగ్.. 2023లో తొలిసారి పది బిలియన్లను తాకగా.. ఇప్పుడు $ 12 బిలియన్లకు చేరుకుంది. ఇక 2024లో 10 జట్ల సమిష్టి బ్రాండ్ విలువ 13% పెరగడంతో.. ప్రస్తుతం $ 12 బిలియన్ల వద్ద కొనసాగుతోంది.
ఇందులో మీడియా రైట్స్ 48 వేల కోట్లు కావడం గమనార్హం. ఈ టోర్నీలోని నాలుగు ప్రధాన జట్లు అయిన కలకత్తా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ లా బ్రాండ్ విలువ వంద మిలియన్ డాలర్లు దాటిపోయింది. ప్రతి సీజన్లో ఐపిఎల్ కి మీడియా రైట్స్ ద్వారానే 12 వేల కోట్ల ఆదాయం వస్తుంది. పైగా ప్రభుత్వం ఐపీఎల్ ని పన్ను నుంచి మినహాయింపు కూడా ఇవ్వడం గమనార్హం.
ఇక ప్రభుత్వం ఐపిఎల్ నుండి ఎటువంటి పన్నులు పొందకపోయినా.. మ్యాచ్ల ద్వారా బాగానే సంపాదిస్తోంది. 2024 నవంబర్లో జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలం ద్వారా కేంద్ర ఖజానాకు 90 కోట్లు వచ్చి పడ్డాయి. ఈ ఆదాయం క్రికెటర్ల జీతం నుండి ప్రభుత్వానికి అందుతుంది. టీడిఎస్ ద్వారా ప్రభుత్వానికి ఈ ఆదాయం సమకూరుతుంది. ఇక తెలుగు జట్టు సన్రైజర్స్ హైదరాబాద్ విలువ ఏకంగా 76% పెరిగి.. సుమారు 85 మిలియన్లు.. అంటే 719 కోట్లకు చేరుకుంది.