Jasprit Bumrah: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియా పేస్ ధళ భారం మొత్తాన్ని జస్ ప్రీత్ బుమ్రా తన భుజాలపై మోసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో ఐదు టెస్టులకు గాను రెండు టెస్టులకు బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈ సిరీస్ లో అటు బౌలర్ గా, ఇటు కేప్టెన్ గా అదనపు భారం వల్ల బుమ్రా వెన్ను నొప్పి తిరగబెట్టింది.
ఫలితంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీ మొత్తానికి బుమ్రా దూరం అయ్యాడు. ప్రధాన బౌలర్ లేకపోయినప్పటికీ ఈ వన్డే టోర్నీలో భారత జట్టు స్పిన్నర్లను ఎక్కువగా ఉపయోగించుకుని విజయం సాధించింది. ఇక ప్రస్తుతం బుమ్రా వెన్నునొప్పి గాయం నుండి నెమ్మదిగా కోలుకుంటున్నాడు. మరో 8 రోజులలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అతడి విషయంలో ముంబై మేనేజ్మెంట్ లో ఆందోళన కొనసాగుతోంది. ఈ క్రమంలో బుమ్రా గురించి ఓ అప్డేట్ వచ్చింది. మార్చ్ మొత్తానికి ఐపీఎల్ కి దూరం కానున్నాడు బుమ్రా.
అతడు ఏప్రిల్ లో ముంబై జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది. అది కూడా బీసీసీఐ మెడికల్ టీం ఇచ్చే రిపోర్టును బట్టి ఉంటుందని సమాచారం. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ తరఫున బుమ్రా ఎన్ని మ్యాచ్ లు మిస్ అవుతాడో ప్రస్తుతానికి తెలియదు. నిజానికి ఐపీఎల్ ప్రారంభంలో రెండు, మూడు మ్యాచ్ లకు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని భావించారు. అయితే ఈ ఏడాది జనవరి నుండి బుమ్రా ఇప్పటివరకు ఒక అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ముంబైకి బుమ్రా సేవలు మార్చి మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ తొలి వారంలో బుమ్రా జట్టులో చేరతాడని క్రీడా వర్గాలు తెలిపాయి. కాగా ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్ ని మార్చ్ 23న చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడబోతోంది. ఆ తర్వాత మార్చి 29న గుజరాత్ టైటాన్స్, 31న కలకత్తా నైట్ రైడర్స్ తో తలపడబోతోంది. అయితే బూమ్రా లేకపోవడం ఆ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు.
బూమ్రా పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు మరికొంత సమయం పడుతుందని బీసీసీఐ ఫిజియోలు చెబుతున్నారు. ప్రస్తుతం అతడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో నెట్ ప్రాక్టీస్, మ్యాచ్ సిమ్యూలేషన్ ద్వారా బౌలింగ్ వర్క్ లోడ్ ని పెంచుతున్నప్పటికీ.. అతడు రీయంట్రీ ఇచ్చేందుకు ఫిజియోలు ఎలాంటి డెడ్లైన్ పెట్టుకోలేదని తెలుస్తోంది. జూన్ లో ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ ని దృష్టిలో ఉంచుకొని బుమ్రా పూర్తి ఫిట్నెస్ తో రీఏంట్రీ ఇచ్చేందుకు ఇంకా సమయం పడుతుందని బిసిసిఐ బోర్డు వర్గాలు చెబుతున్నాయి.
ఒకవేళ బుమ్రా కొన్ని మ్యాచ్లకి దూరమైనప్పటికీ జట్టులో నాణ్యమైన పేస్ బౌలర్లకు లోటు లేదు. బౌల్ట్, టోప్లీ, దీపక్ చాహర్, కార్బిన్ బోష్, హార్దిక్ పాండ్యా లాంటి వారితో పటిష్టంగా ఉంది. ఇక గత సంవత్సరం టోర్నీ చరిత్రలో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది ముంబై ఇండియన్స్. కానీ ఈసారి ఎలాగైనా కప్ సాధించాలనే పట్టుదలతో ఉంది.