E-Paper
Advertisement

TS Assembly CM Revanth Reddy: కేసీఆర్ అక్కడే ఉండాలి.. నేను ఇక్కడే ఉండాలి.. సమాధానాలు చెప్పలేకే ముఖం చాటేశారు

TS Assembly CM Revanth Reddy: కేసీఆర్ అక్కడే ఉండాలి.. నేను ఇక్కడే ఉండాలి.. సమాధానాలు చెప్పలేకే ముఖం చాటేశారు
Advertisement

TS Assembly CM Revanth Reddy| తెలంగాణలో గత బీఆర్ఎస్ పాలనలో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు జరిగాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలను పాటించలేదని వారు తీవ్రంగా విమర్శించారు. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్‌ను గౌరవిస్తుందని పరోక్షంగా బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డికి చురకలంటించారు. అలాగే, మార్చి 31వ తేదీ నాటికి రైతులకు రైతు భరోసా పథకం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ, “గవర్నర్‌కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. గతంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు జరిగాయి. బలహీన వర్గాలకు చెందిన మహిళ.. రాష్ట్ర గవర్నర్‌గా ఉంటే, ఆమెను సూటిగా అవమానించే మాటలతో అవహేళన చేశారు. భారత రాజ్యాంగం స్ఫూర్తితో వ్యవస్థలు ఏర్పడ్డాయి. రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. గత ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను పాటించలేదు. అజ్ఞానమే గొప్ప విజ్ఞానం అనుకుంటున్నారు. గవర్నర్ ప్రసంగం గాంధీభవన్‌లో కార్యకర్త ప్రసంగంలా ఉందని కొందరు తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. గవర్నర్‌ను గౌరవించే బాధ్యత మాది. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేశాం. వాటినే గవర్నర్ ప్రస్తావించారు. మాట్లాడాలనుకున్నదే మాట్లాడతాం. ఎవరు అడ్డుకున్నా వెళ్లిపోతాం అన్నట్టుగా ఉంది బీఆర్ఎస్ సభ్యుల తీరు” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

Advertisement

రైతుల ఆత్మహత్యలకు అప్పులే ప్రధాన కారణం అని ముఖ్యమంత్రి వివరించారు. అవమానాలు భరించలేకనే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, రుణాల నుంచి రైతులను విముక్తి చేయాలని నిర్ణయించామని తెలిపారు. వాస్తవాల మీద ప్రభుత్వాన్ని నడపాలని చూస్తున్నామని, ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామని ప్రకటించారు. రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, రైతులు ఆత్మగౌరవంతో బతకాలన్నదే మా విధానం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో ఎన్నికల సమయంలో రైతుబంధు పథకం కింద డబ్బు అకౌంట్లలోకి పడేదని, మార్చి 31 నాటికి రైతులందరికీ రైతుభరోసా పథకం అందిస్తామని హామీ ఇచ్చారు.

Also Read:  అసెంబ్లీలో పల్లా రాజేశ్వర్ రెడ్డి అసత్యాలు మాట్లాడుతున్నారు.. డిప్యూటీ సిఎం భట్టి ఫైర్

కాళేశ్వరం లేకుండానే రాష్ట్రంలో అత్యధిక పంటలు

Advertisement

గతంలో ఎక్కడ పంట పండినా కాళేశ్వరం వల్లే అని చెప్పుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిన తర్వాత 260 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను పండించామని, సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు. గత ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కై రైతులకు అన్యాయం చేసిందని ఆరోపించారు. గతంలో కేసీఆర్ వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే అని అన్నారు. కానీ, మేము అధికారంలోకి వచ్చాక రైతులను వరి పండించాలని కోరాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చామని, రైతులకు భరోసా ఇచ్చామని తెలిపారు.

మార్చురీ అనే పదం BRS పార్టీని అన్నాను…కెసిఆర్ ను కాదు

ఏ మాత్రం అవగాహన లేనివాళ్ళు పదేళ్లు మంత్రులుగా ఉన్నారని చెప్పుకోవడానికి అనర్హులని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు ఇలాగే వ్యవహరిస్తే… రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గుండు సున్నా రావడం ఖాయం అని సెటైర్లు వేశారు. ప్రజలు చనిపోతుంటే బిఆర్ఎస్ నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా శ్రేయస్సు కోసం విపక్షాలు సూచనలు చేస్తే తప్పక స్వీకరిస్తామని అన్నారు. ఇటీవల బిఆర్‌ఎస్ పార్టీ మార్చురీలో ఉందని తాను చేసిన వ్యాఖ్యలను కేసిఆర్‌కు ఆపాదించారని.. కానీ తాను కేసిఆర్ వంద సంవత్సరాలు పూర్తి ఆరోగ్యంతో జీవించాలని కోరుకుంటున్నట్లు రేవండ్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ అలా వందేళ్లు ప్రతిపక్షంలోనే ఉండాలని.. తాను అధికారంలోనే ఉండాలని సిఎం రేవంత్ చమత్కరించారు.

“ప్రతిపక్ష నేత సీటు తప్ప కేసీఆర్‌ దగ్గర ఇంకేమి ఉంది.. కేటీఆర్‌కో, హరీష్‌ రావుకో ఆ సీటు కావాలి. ప్రతిపక్ష నేత సీటు నాకేం ఉపయోగపడుతుంది. కేసీఆర్‌ వందేళ్లు ఆరోగ్యంతో ప్రతిపక్షంలోనే ఉండాలి.. నేను ఇక్కడే (అధికారంలోనే) ఉండాలి. కేసీఆర్ అసలు సభకే రావడం లేదు. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుందనే కేసీఆర్ మొహం చాటేశారు. కేసీఆర్‌ సభకు ప్రతిపక్ష నాయకుడిగా వచ్చింది రెండుసార్లే” అని సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను ఎద్దేవా చేశారు.

అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్

తెలంగాణ  అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు వాడీవేడిగా కొనసాగుతున్నాయి.  అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ కొనసాగుతుండగా, రైతు రుణమాఫీతో పాటు గృహ జ్యోతి పథకాలపై అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు సంధించిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగానే బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. సీఎం ప్రసంగాన్ని తాము బాయ్‌కాట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. తమ అధినేత కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు తెలిపారు.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×