Mayank Yadav Injury: మరికొద్ది రోజులలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 ప్రారంభం కానున్న వేళ లక్నో సూపర్ జెయింట్స్ కి షాక్ తగిలింది. లక్నో స్టార్ పేస్ బౌలర్ మయాంక్ యాదవ్ జట్టుకు దూరమయ్యాడు. గాయం కారణంగా మయాంక్ యాదవ్ ఈ సీజన్ ఫస్ట్ ఆఫ్ కి అందుబాటులో ఉండడం లేదని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. గత సీజన్ లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన మయాంక్ యాదవ్ ని మెగా వేలంలో లక్నో ఫ్రాంచైజీ 11 కోట్లు చెల్లించి రిటైన్ చేసుకుంది.
ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ మెరుపు వేగంతో బంతులను వేస్తూ హాట్ టాపిక్ గా మారాడు. గంటకు 150 కి పైగా వేగంతో బంతులు విసురుతూ యువ బౌలర్లందరిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అంతేకాకుండా లక్నో తరపున వరుసగా రెండు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకొని.. ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన మొదటి క్రికెటర్ గా రికార్డులకి ఎక్కాడు. గత సీజన్ లో మయాంక్ యాదవ్ లక్నో తరపున నాలుగు మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి 73 బంతులలో 25 పరుగులు మాత్రమే ఇచ్చి మొత్తం 7 వికెట్లు పడగొట్టాడు.
గత ఏడాది బంగ్లాదేశ్ తో జరిగిన టి-20 సిరీస్ తో మయాంక్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. తన అంతర్జాతీయ కెరీర్ లో తొలి ఓవర్ లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా సరికొత్త రికార్డు సృష్టించాడు. అతడి తొలి ఓవర్ మెయిడిన్ గా నిలిచింది. దీంతో ఈ ఘనత సాధించిన మూడవ భారత బౌలర్ గా నిలిచాడు. ఇలాంటి అద్భుతమైన బౌలర్ గాయం కారణంగా ఈ సీజన్ ఫస్ట్ ఆఫ్ కి దూరం కావడంతో లక్నో అభిమానులు నిరాశకి గురవుతున్నారు. ఇక ఈ సీజన్ లో మార్చి 24న లక్నో తన తొలి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆడనుంది.
ఇక ఈ సీజన్ లో లక్నో ఫ్రాంచైజీకి రిషబ్ పంత్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్న విషయం తెలిసిందే. 2025 మెగా వేలంలో పంత్ ని లక్నో యాజమాన్యం రూ. 27 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో అతడికే నాయకత్వ బాధ్యతలను అప్పగించింది. రెండు కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన పంత్.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఐపీఎల్ లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.
ఐపీఎల్ 2025 లక్నో జట్టు: నికోలస్ పూరన్ (రూ. 21 కోట్లు), రవి బిష్ణోయ్ (రూ. 11 కోట్లు), మయాంక్ యాదవ్ (రూ. 11 కోట్లు), మొహ్సిన్ ఖాన్ (రూ. 4 కోట్లు), ఆయుష్ బడోని (రూ. 4 కోట్లు), రిషబ్ పంత్ (రూ. 27 కోట్లు), డేవిడ్ మిల్లర్ (రూ. 7.5 కోట్లు), ఐడెన్ మార్క్రామ్ (రూ. 2 కోట్లు), మిచెల్ మార్ష్ (రూ. 3.40 కోట్లు), అవేష్ ఖాన్ (రూ. 9.75 కోట్లు), అబ్దుల్ సమద్ (రూ. 4.20 కోట్లు), ఆర్యన్ జుయల్ (రూ. 30 లక్షలు), ఆకాష్ దీప్ (రూ. 8 కోట్లు), హిమ్మత్ సింగ్ (రూ. 30 లక్షలు), ఎం. సిద్ధార్థ్ (రూ. 75 లక్షలు), దిగ్వేష్ సింగ్ (రూ. 30 లక్షలు), షాబాజ్ అహ్మద్ (రూ. 2.40 కోట్లు), ఆకాష్ సింగ్ (రూ. 30 లక్షలు), షామర్ జోసెఫ్ (రూ. 75 లక్షలు), ప్రిన్స్ యాదవ్ (రూ. 30 లక్షలు), యువరాజ్ చౌదరి (రూ. 30 లక్షలు), రాజవర్ధన్ హంగర్గేకర్ (రూ. 30 లక్షలు), అర్షిన్ కులకర్ణి (రూ. 30 లక్షలు), మాథ్యూ బ్రీట్జ్కే (రూ. 75 లక్షలు).