MS Dhoni CSK captain: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని బ్యాట్ పట్టి క్రీజ్ లోకి వస్తుంటే చాలు స్టేడియం దద్దరిల్లిపోతుంది. ప్రత్యర్థి జట్టు అభిమానులు సైతం అతడి ఆటను ఆరాధిస్తారు. అలాంటి మహేంద్ర సింగ్ ధోని మళ్లీ కెప్టెన్ గా బాధ్యతలు చేపడితే.. ఇక ఆరోజు పండగే కదా..! అవును.. చెన్నై సూపర్ కింగ్స్ ని మళ్లీ మహేంద్రసింగ్ ధోని కెప్టెన్ గా ముందుకు నడిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా మ్యాచ్ కి దూరం కావడంతో తిరిగి కెప్టెన్సీ పగ్గాలను మహేంద్రసింగ్ ధోని చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ 5 శనివారం రోజున చెపాక్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్ తో మ్యాచ్ ఆడబోతోంది చెన్నై సూపర్ కింగ్స్. ఈ మ్యాచ్ కి మరోసారి ధోని కెప్టెన్ గా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతరాజ్ గైక్వాడ్ గాయపడ్డాడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తుషార్ దేశ్పాండే బౌలింగ్ లో అతడి మోచేతికి గాయమైంది.
దీంతో నేడు ఢిల్లీతో జరగబోయే మ్యాచ్ లో అతడు బరిలోకి దిగుతాడా..? లేదా..? అన్నదానిపై చెన్నై బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సి స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ ఋతురాజు గైక్వాడ్ ఆడకపోతే.. ధోనికే కెప్టెన్సీ దక్కనుంది. ఇక ఋతురాజ్ గాయంపై కోచ్ మైకేల్ హస్సి మాట్లాడుతూ.. చెపాక్ లో జరిగే ప్రాక్టీస్ సెషన్ లో రుతురాజ్ ఫిట్నెస్ ని పరిశీలిస్తామని తెలిపారు. అతడు ఆడతాడా లేదా అనేది మ్యాచ్ రోజే నిర్ణయిస్తామని స్పష్టం చేశాడు.
అయితే గైక్వాడ్ మ్యాచ్ కి దూరమైతే కెప్టెన్సీ బాధ్యతలు ఎవరు చేపడతారని ప్రశ్నించగా..? హస్సి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. స్టంప్స్ వెనకాల చురుగ్గా కదిలే యువకుడికి ఆ అవకాశం దక్కుతుందని పరోక్షంగా ధోనీ గురించి చెప్పారు. దీంతో కెప్టెన్సీ బాధ్యతలలో ధోనిని మరోసారి చూసే అవకాశం అభిమానులకు దక్కనుంది. చివరిసారిగా మహేంద్ర సింగ్ ధోని చెన్నైకి 2023 లో కెప్టెన్ గా వ్యవహరించాడు.
ఆ సీజన్ లో అద్భుత ప్రదర్శనతో జట్టును చాంపియన్గా నిలబెట్టాడు. అంతేకాకుండా ఐదుసార్లు చెన్నై సూపర్ కింగ్స్ కి టైటిల్ అందించి, ఎక్కువసార్లు టైటిల్ గెలిచిన ముంబై సరసన చెన్నై ని నిలిపాడు. ఆ తర్వాత సీజన్ నుండి ఋతురాజు గైక్వాడ్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. ఇక రెండు సంవత్సరాల తర్వాత ధోని చెన్నై కెప్టెన్సీ బాధ్యతలు చేపడతాడా..? అనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతుంది.
ఇక ఈ సీజన్ లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్లలో చెన్నై కేవలం ఒక మ్యాచ్ లోనే విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ తో జరిగిన తొలి మ్యాచ్లో సాధికారిక విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్లలోనూ చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో 50 పరుగుల తేడాతో, రాజస్థాన్ చేతిలో ఆరు పరుగులతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో శనివారం సొంత గడ్డ చెపాక్ మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగే మ్యాచ్ లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది చెన్నై సూపర్ కింగ్స్.