Arshad Nadeem felicitation| పాకిస్తాన్ ప్రధాన మంత్రి తమను ఘోరంగా అవమానించారంటూ ఆ దేశ మాజీ హాకీ ప్లేయర్లు తీవ్ర విమర్శలు చేశారు. పారిస్ ఒలింపిక్స్ లో పాకిస్తాన్ కు జావెలిన్ త్రో బంగారు పతకం సాధించిన అర్షద్ నదీమ్ కు శనివారం సాయంత్రం పాకిస్తాన్ ప్రభుత్వం సన్మాన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమం వల్ల తమకు అవమానం జరిగిందంటూ పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఇటీవల జరిగిన ఒలింపిక్స్ అర్షద్ నదీమ్ జావెలిన్ త్రోలో 92.97 మీటర్ల రికార్డను సాధించి చాంపియన్ గా నిలిచాడు. దీంతో ప్రస్తుతం పాకిస్తాన్ లో నదీమ్ హీరోగా మారాడు. ఎక్కడ చూసినా అర్షద్ నదీమ్ కు బహుమానాలు, దావత్ లు, పార్టీలు లభిస్తున్నాయి. పంజాబ్ ముఖ్యమంత్రి మరియయ్ నవాజ్.. పారిస్ ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ చాంపియన్ కు రూ.కోటి క్యాష్ ప్రైజ్ తో పాటు ఒక కారు బహుమానంగా ఇచ్చారు. ఆమె స్వయంగా నదీమ్ స్వగ్రామానికి వెళ్లి అతడికి బహుమతులు ఇచ్చారు.
అయితే కొన్ని రోజుల క్రితమే ప్రధాన మంత్రి షహ్బాజ్ షరీఫ్.. ఒలింపిక్స్ చాంపియన్ అర్షద్ నదీమ్ కు రూ.10 లక్షల (భారత కరెన్సీ రూ.3 లక్షలు) చెక్ ఇవ్వడంతో నెటిజెన్లు ఆయనను విమర్శించారు. దీంతో పాక్ ప్రధాని ఈసారి నదీమ్ గెలుపుని సెలబ్రేట్ చేసుకునేందుకు అతడిని సన్మానిస్తూ.. ఒక డిన్నర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కారక్రమానికి పాకిస్తాన్ జాతీయ క్రీడాకారులందరినీ ఆహ్వానించారు. ఈ క్రమంలోనే ఒలింపిక్స్ లో పాకిస్తాన్ కు బంగారు, కాంస్య పతకాలు సాధించిన మాజీ హాకీ ఆటగాళ్లకు ఆహ్వానాలు అందాయి. ఈ మాజీ హాకీ ఆటగాళ్లందరూ పాకిస్తాన్ లో లెజెండ్స్గా గుర్తింపు పొందారు.
అయితే కార్యక్రమానికి కొన్ని గంటల ముందు ఈ హాకీ లెజెండ్స్ కు ప్రధాని కార్యాలయం నుంచి ఈ మెయిల్ వచ్చింది. డిన్నర్ కార్యక్రమానికి రావొద్దు.. మీకు అందిన ఆహ్వానాలు ఉపసంహరించుకుంటున్నాం అని మెయిల్ లో ఉంది. నదీమ్ సన్మాన కార్యక్రమానికి ఎక్కువ మంది అతిథులు వచ్చారని.. వారందరికి అతిథి మర్యాదలు చేయలేమని కారణం చూపుతూ.. ఈ హాకీ లెజెండ్స్ ను కార్యక్రమానికి దూరంగా ఉండాలని ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి మెసేజ్ వచ్చింది. దీంతో లెజెండ్ హాకీ ప్లేయర్లు ఇది తమకు జరిగిన అవమానంగా భావిస్తున్నారు.
మాజీ ఒలింపిక్స్ ఆటగాడు, పాకిస్తాన్ హాకీ లెజెండ్ రావ్ సలీమ్ నాజిమ్.. ప్రధాన మంత్రి తమతో వ్యవహరించిన తీరు అవమానకరంగా ఉందని మండిపడ్డారు. ”నదీమ్ సన్మాన డిన్నర్ కార్యక్రమానికి రావాలని వారే ఆహ్వానాలు పంపారు. కానీ ఏదో అతిథులు ఎక్కువై పోయారు మీరు రావొద్దు అని చివరి నిమిషంలో మెసేజ్ చేస్తారా?.. దేశం కోసం ఎన్నో ఒలింపిక్స్ పతకాలు సాధించిన ఆటగాళ్లకు మీరిచ్చే గౌరవమిదేనా?” అని ఆయన ప్రశ్నించారు.
1983 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లో పాకిస్తాన్ బంగారు పతకం సాధించి హాకీ ఒలింపిక్ చాంపియన్ గా నిలిచింది. ఆ తరువాత 1992 ఒలింపిక్స్ లో ఒక కాంస్య పతకం సాధించింది. ఇదే పాకిస్తాన్ ఒలింపిక్స్ లో ఆడిన చివరి మ్యాచ్. ఆ తరువాత నుంచి ఇప్పటివరకు పాకిస్తాన్ హాకీ జట్టు ఒలింపిక్స్ కోసం అర్హత సాధించలేదు.
Also Read: తినడానికి తిండి లేదు.. తండ్రి కూలీ.. కట్ చేస్తే ఇప్పుడు ఒలింపిక్ హీరో