Rohit Sharma: టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలో 2024లో భారత క్రికెట్ జట్టు టి-20 వరల్డ్ కప్ లో ఘనవిజయం సాధించింది. ఫైనల్ లో సౌత్ ఆఫ్రికా జట్టును 7 పరుగుల తేడాతో ఓడించి భారత్ విజేతగా నిలిచింది. 2007లో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో భారత జట్టు తొలి టీ-20 వరల్డ్ కప్ ని గెలుచుకుంది.
Also Read: Mitchell Starc: వసీం అక్రమ్ రికార్డు బద్దలు కొట్టిన స్టార్క్.. ఏకంగా 415 వికెట్లతో
ఆ జట్టులో రోహిత్ శర్మ కూడా కీలక సభ్యుడిగా ఉన్నాడు. తిరిగి 17 సంవత్సరాల తరువాత రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు 2024లో మళ్లీ టి-20 ప్రపంచ కప్ ని సొంతం చేసుకుంది. ఈ కప్ సాధించిన అనంతరం రోహిత్ శర్మ తన టి-20 అంతర్జాతీయ కెరీర్ కి వీడ్కోలు పలికాడు.
టీమిండియా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ మళ్ళీ టి-20 క్రికెట్ లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే టెస్ట్ లకు, టి-20 లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. ప్రస్తుతం వన్డే ఫార్మాట్, ఐపీఎల్ లో మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే టి-20 ల్లో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని రోహిత్ శర్మ వెనక్కి తీసుకోనున్నట్లు పలు జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ నెలలో జరిగే దేశీయ టోర్నమెంట్ లో రోహిత్ శర్మ మళ్ళీ కనిపించనున్నాడని తెలుస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. “రోహిత్ శర్మ 2025 సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో ముంబై తరఫున ఆడేందుకు ఆసక్తి వ్యక్తం చేశాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ {MCA} లో ఓ సీనియర్ అధికారి కూడా రోహిత్ శర్మ అందుబాటులోకి రాబోతున్నాడని ధ్రువీకరించారు”. అని పేర్కొంది. అయితే డిసెంబర్ 12 నుండి 18 వరకు జరిగే నాకౌట్ దశలో రోహిత్ శర్మ జట్టులో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ చివరిసారిగా సయ్యద్ ముస్తఖ్ అలీ ట్రోఫీలో ఆడింది 2007లో. దాదాపు 18 సంవత్సరాల తర్వాత రోహిత్ శర్మ దేశీయ టి-20 టోర్నీలో అడుగు పెట్టబోతున్నాడు.
రోహిత్ శర్మ ఇప్పటివరకు తన టి-20 కెరీర్ లో 463 మ్యాచ్ లు ఆడాడు. ఇందులో 12,248 పరుగులు చేశాడు. వీటిలో 8 సెంచరీలు, 82 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ లో అద్భుతంగా రానిస్తున్నాడు రోహిత్ శర్మ. మొదటి వన్డేని అద్భుతమైన హాఫ్ సెంచరీ తో ప్రారంభించాడు. ఈ వన్డే సిరీస్ కి ముందు జరిగిన ఆస్ట్రేలియా టూర్ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచి తన క్లాస్ ని మరోసారి చాటుకున్నాడు.
Also Read: Irfan Pathan: జడేజా చేతకానీ తనం వల్లే టీమిండియా ఓటమి.. ఇక రిటైర్మెంట్ తీసుకో !
అయితే భారత జట్టుకు అందుబాటులో ఉండాలనుకున్న ప్రతి ఆటగాడు తప్పనిసరిగా దేశీయ క్రికెట్ లో ఆడాలని బీసీసీఐ తీసుకున్న నిర్ణయమే.. 18 సంవత్సరాల తర్వాత రోహిత్ శర్మను సయ్యద్ ముస్తఖ్ అలీ ట్రోఫీలో పాల్గొనేందుకు దారితీసిందని భావిస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సయ్యద్ ముస్తఖ్ అలీ ట్రోఫీలో రోహిత్ శర్మ కనబడడం ముంబై జట్టుకు భారీ బలాన్ని ఇస్తుందని చెప్పాలి. రోహిత్ శర్మ రాకతో టోర్నమెంట్ పై దృష్టి మరింత పెరిగే అవకాశం ఉంది.