Shardul Thakur: ఐపీఎల్ 2026 సీజన్ కి ముందు జరగబోయే ఆటగాళ్ల ట్రేడింగ్ పై ఆసక్తికరమైన ఓ వార్త బయటకు వచ్చింది. టీమిండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాగూర్ ని లక్నో సూపర్ జెయింట్స్ {LSG} నుంచి ముంబై ఇండియన్స్ {MI} ట్రేడ్ చేసుకున్నట్లు టీమిండియా మాజీ ఆటగాడు, సీనియర్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ధ్రువీకరించారు.
తన యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ అశ్విన్ ఈ విషయాన్ని వెల్లడించారు. తద్వారా శార్దూల్ ఠాకూర్ ఓ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే మూడుసార్లు ట్రేడ్ చేసుకున్న ఏకైక ఆటగాడిగా శార్దూల్ ఠాకూర్ నిలిచాడు.
2017 ఐపీఎల్ సీజన్ లో శార్దూల్ ఠాకూర్ ని తొలిసారి రైజింగ్ పూనే సూపర్ జెయింట్స్ ట్రేడ్ చేసుకుంది. పంజాబ్ కింగ్స్ నుంచి ఇతడిని తీసుకుంది. ఇక 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి కలకత్తా ట్రేడ్ చేసుకుంది. తాజాగా ముంబై ఇండియన్స్ ట్రేడ్ చేసుకోవడంతో మూడుసార్లు వేళానికి ముందే జట్టు మారిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు శార్దూల్ ఠాకూర్. నిజానికి ఇతడు ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో అన్ సోల్డ్ గా నిలిచాడు. ఇతడిని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. అయితే సీజన్ ప్రారంభానికి ముందు ఇతడిని ఇంజ్యూరీ రీప్లేస్మెంట్ గా లక్నో సూపర్ జెంట్స్ తీసుకుంది. ఆ సీజన్ లో ఇతడికి రెండు కోట్ల కనీస ధర చెల్లించగా.. అనూహ్య ప్రదర్శన కనబరిచాడు. 10 మ్యాచ్ లు ఆడి 11 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనకు ఫిదా అయిన ముంబై ఇండియన్స్ ఇతడిని రెండు కోట్ల క్యాష్ ట్రేడింగ్ ద్వారా జట్టులోకి తెచ్చుకుంది. అయితే కేవలం ట్రేడ్ ప్రక్రియ ద్వారా మూడుసార్లు జట్లు మారడం మాత్రమే కాకుండా.. వేలం ద్వారా మరో ఆరుసార్లు జట్లు మారాడు శార్దూల్.
ఐపీఎల్ {IPL} చరిత్రలో ఫ్రాంచైజీలు మారిన ఆటగాళ్లు ఎందరో ఉన్నప్పటికీ.. వారిలో కొందరు అత్యధిక జట్లకు ప్రాతినిధ్యం వహించి రికార్డులు సృష్టించారు. ఐపీఎల్ లో అత్యధిక ఫ్రాంచైజీలకు ప్రతినిథ్యం వహించిన రికార్డు ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ ఆరోన్ ఫించ్ పేరిట ఉంది. ఇతడు ఏకంగా తొమ్మిది ఫ్రాంచైజీలకు ప్రతినిత్యం వహించాడు.
అలాగే భారత పేసర్ జయదేవ్ ఉనద్కట్ ఏకంగా 8 జట్లకు ఆడి రికార్డు క్రియేట్ చేశాడు. మనిష్ పాండే కూడా తన ఐపిఎల్ కెరీర్ ని ముంబై ఇండియన్స్ జట్టుతో ప్రారంభించి.. ఏడు జట్లకు ప్రతినిథ్యం వహించాడు. దినేష్ కార్తీక్ 6, వరుణ్ ఆరోన్ 6, మురుగన్ అశ్విన్, ఇశాంత్ శర్మ, యువరాజ్ సింగ్ వంటి ఆటగాళ్లు కూడా ఆరు జట్లకు ప్రాతినిధ్యం వహించారు.