T20 Worldcup finals : టీట్వంటీ వరల్డ్ కప్ తుది అంకానికి చేరింది. ఆదివారం పాకిస్తాన్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఫైనల్ ఫైట్ జరగనుంది. ఈ రెండు జట్లు ఐసీసీ ప్రపంచకప్ టోర్నీ ఫైనల్ లో తలపడటం ఇది రెండోసారి. 1992 వన్డే ప్రపంచకప్ లో ఇంగ్లాండ్-పాకిస్తాన్ తుదిపోరులో తలపడ్డాయి. ఇప్పుడు మళ్లీ 30 ఏళ్ల తర్వాత ఈ రెండు జట్లు ఫైనల్స్ ఆడబోతున్నాయి. వేదిక కూడా అదే మెల్బోర్న్ కావడం విశేషం..
ప్రస్తుత టీ20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ తొలి మ్యాచ్ లో భారత్ చేతిలో ఓడింది. తర్వాత జింబాబ్వే పైనా ఇదే ఫలితం. కానీ తర్వాత వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచి.. సౌతాఫ్రికా పై నెదర్లాండ్స్ నెగ్గడంతో అదృష్టం కలిసొచ్చి సెమీస్ కు చేరింది. అచ్చం 1992లోనూ ఇదే జరిగింది. మెల్బోర్న్ లోనే జరిగిన తొలి లీగ్ మ్యాచ్ లో ఓడింది. గ్రూప్ స్టేజ్ లో ఇండియా చేతిలో పరాజయం. తర్వాత వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచి ఒక అదనపు పాయింట్ తో చావు తప్పి కన్నులొట్టబోయినట్టు సెమీస్ చేరింది. సెమీస్ లో న్యూజిలాండ్ ను ఓడించింది. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. ఫైనల్ లో మెల్బోర్న్ లో ఇంగ్లాండ్ తో తలపడింది.
1992 ఫైనల్ లో పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ 72, జావేద్ మియాందాద్ 58, ఇంజమామ్ ఉల్ హక్ 42 పరుగులతో రాణించారు. చివర్లో వసీం అక్రమ్.. 18 బంతుల్లో 33 పరుగులు చేశాడు. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ తడబడింది. ఫలితంగా ఇంగ్లాండ్.. 49.2 ఓవర్లలో 227 పరుగులకే పరిమితమైంది. పాకిస్తాన్ 22 పరుగుల తేడాతో గెలుపొంది తమ తొలి వన్డే ప్రపంచకప్ ను ముద్దాడింది.
గత రికార్డులు అన్నీ పాకిస్తాన్ కే అనుకూలంగా ఉన్నాయి. 1992 సెంటిమెంట్ పునరావృతం అవుతుందని పాక్ ఫ్యాన్స్ సంబురాలు కూడా మొదలుపెట్టారు. అయితే జరుగుతున్నది టీ20 కాబట్టి ఏమైనా జరగొచ్చు. అదీ ఇంగ్లాండ్ వంటి పటిష్ట జట్టు. తమదైన రోజున మ్యాచ్ ను ఒంటిచేత్తో గెలిపించే ఆటగాళ్లు ఆ జట్టు నిండా ఉన్నారు. ఇలాంటి తరుణంలో మంత్రాలకు చింతకాయలు రాలవన్నట్టుగా.. సెంటిమెంట్ ను నమ్ముకుంటే పనికాదని.. మ్యాచ్ లో వందశాతం మెరుగైన ప్రదర్శన చేసినవారినే విజయం వరిస్తుందని క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ విషయానికి వస్తే.. ఇరు జట్లు చెరొకసారి బుల్లి కప్ ను తమ ఖాతాలో వేసుకున్నాయి. ఇంగ్లాండ్ వేదికగా 2009 లో జరిగిన టీ20 ప్రపంచ కప్ ను పాకిస్థాన్ కైవసం చేసుకుంది. ఇక వెస్టిండీస్ లో జరిగిన 2010 టీ20 వరల్డ్ కప్ ను ఇంగ్లాండ్ చేజిక్కించుకొని.. తొలిసారి ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. ఇప్పుడు ఎవరు గెలిచినా.. రెండుసార్లు పొట్టి ప్రపంచ కప్ టైటిల్ సాధించిన విండీస్ సరసన చేరనున్నారు.
టైటిల్ పోరులో ఇంగ్లండ్ పాకిస్తాన్ హోరాహోరీగా తలపడటం ఖాయంగా కనిపిస్తోంది. మరి నవంబర్ 13న మెల్బోర్న్ లో చరిత్ర పునరావృతమవుతుందా..? లేక కొత్త చరిత్రకు నాంది పడుతుందా..? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు