Trolls On BCCI: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (England vs India) మధ్య టి20 సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో బీసీసీఐపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. బీసీసీఐ ( BCCI) చెత్త నిర్ణయాల వల్ల టీమిండియా ప్రదర్శన చెత్తగా ఉంటుందని సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు పెడుతున్నారు అభిమానులు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ( IPL ) ద్వారా డబ్బులు సంపాదించి, టీమిండియా క్రికెటర్ల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ కారణంగానే ఐర్లాండ్ చేతిలో ఓడిపోయిన టీమ్ ఇండియా, ఇప్పుడు ఇంగ్లాండ్ చేతిలో కూడా అదే ప్రదర్శన కనబరుస్తోందని అంటున్నారు.
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ జరుగుతోంది. ఇప్పటికే ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ అయిన టీమిండియా… ఇంగ్లాండ్ చేతిలో వరుసగా రెండు టీ20లో ఓటమిపాలైంది. మొదటి మ్యాచ్ వర్షార్పణమైంది.. లేకపోతే ఆ మ్యాచ్ కూడా దొబ్బేది. అయితే నిన్న మూడవ టి20 ఓడిపోయిన నేపథ్యంలో టీమిండియా ప్లేయర్లను చాలా మంది సీనియర్ క్రికెటర్లు తిడుతున్నారు. అయితే కొంతమంది అభిమానులు మాత్రం తిట్టాల్సింది టీమిండియాను కాదని, బీసీసీఐ పెద్దలను తన్నాల్సిందే అంటూ సంచలన పోస్టులు పెడుతున్నారు.
రెండు నెలల ఐపీఎల్ వ్యూయర్షిప్, డబ్బుల సంపాదన కోసం టీమిండియా క్రికెటర్ల జీవితాలతో బీసీసీఐ ఆడుకుంటుందని ఫైర్ అవుతున్నారు. మొన్న రెండు నెలల పాటు టీమిండియా ప్లేయర్లతో ఐపిఎల్ ఆడించిన బీసీసీఐ… రెస్ట్ ఇవ్వకుండానే వరుసగా టోర్నమెంట్లు ఆడిస్తోందని ఫైర్ అవుతున్నారు. అందులోనూ సూర్యకుమార్ యాదవ్ లాంటి గ్రేట్ కెప్టెన్ ను తప్పించారని మండిపడుతున్నారు. ఐపీఎల్ లో భారీ స్కోరు నమోదు కావాలన్న లక్ష్యంతో.. ఫ్లాట్, హైవే లాంటి మైదానాలను తయారు చేశారని బిసిసిఐ పై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా క్రికెటర్లు కూడా ఈ ఐపీఎల్ ఫ్లాట్ మైదానాలకు అలవాటు పడిపోయారని గుర్తు చేస్తున్నారు. ఐపీఎల్ ఆడిన టీమిండియా ప్లేయర్లు.. విదేశీ గడ్డలపై చేతులెత్తేస్తున్నారని షాకింగ్ నిజాలను బయటపెడుతున్నారు ఫ్యాన్స్. ఫ్లాట్ మైదానాలలో ఆడిన తర్వాత టీమిండియా ప్లేయర్లకు కొంత రెస్టు తో పాటు, ప్రాక్టీస్ మ్యాచ్లు కూడా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. ఇవేవీ లేకుండా… వరుసగా టోర్నమెంట్లు బిసిసిఐ ఆడిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు సంపాదించే పనిలో పడ్డ బిసిసిఐ… టీమిండియా ప్లేయర్లకు ఏం కావాలో అర్థం చేసుకోవడం లేదని నిప్పులు చెరుగుతున్నారు.
విదేశీ మైదానాలలో తేలిపోతున్న టీమిండియా క్రికెటర్లు… ఫ్లాట్ మైదానాలకు అలవాటు పడకూడదు. అంటే ఐపిఎల్ టోర్నమెంటులో బ్యాటింగ్ కు అనుకూలంగా కాకుండా.. బౌలింగ్ కు అనుకూలంగా ఉండే మైదానాలను సిద్ధం చేయాలి. అప్పుడే టీమిండియా ప్లేయర్లు విదేశీ టూర్లలో కూడా రాణిస్తారని ఫ్యాన్స్ సూచనలు చేస్తున్నారు. ఆ దిశగా బీసీసీఐ అడుగులు వేయాలని కోరుతున్నారు. ఐపీఎల్ టోర్నమెంట్ తో పాటు టీమిండియా జట్టును కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు.