Michael Clarke: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దాదాపు 8 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గత టోర్నీ రన్నరప్ భారత్.. ఈసారి విజేతగా నిలుస్తోందని జోష్యం చెప్పాడు. సాధారణంగా ఏ క్రికెటర్ అయినా తమ దేశం గెలుస్తుందని చెబుతుంటారు. కానీ మైఖేల్ క్లార్క్ మాత్రం భారత్ కి ఓటు వేశాడు. అంతేకాదు భారత్ గెలుపుకు గల కారణాలను సైతం చెప్పుకొచ్చాడు.
అంతేకాకుండా ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాను భారత్ ఒక్క పరుగు తేడాతో ఓడిస్తుందని అన్నాడు. తాజాగా రెవ్ స్పోర్ట్స్ నిర్వహించిన టాటా స్టీల్ ట్రైబ్లేజర్స్ కాన్క్లేవ్ లో మైఖేల్ క్లార్క్ మాట్లాడుతూ.. ” ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మెగా టోర్ని ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా – భారత జట్లు తలపడతాయని భావిస్తున్నాను. ఆస్ట్రేలియా ఛాంపియన్స్ గా నిలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ భారత జట్టుకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీని భారత జట్టు సొంతం చేసుకుంటుందని నేను అనుకుంటున్నాను.
టీమ్ ఇండియా ప్రస్తుతం ప్రపంచంలోనే నెంబర్ వన్ వన్డే జట్టుగా ఉంది. ఆ జట్టును ఓడించడం అంత ఈజీ కాదు. దుబాయ్ లోని పిచ్ లు స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలంగా ఉంటాయి. భారత స్పిన్నర్లు మెరుగ్గా రాణిస్తూ ఉండడంతో భారత్ కి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో భారత్ – ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ హోరా హోరీగా సాగుతుంది. కానీ ఈ ఫైనల్ లో భారత జట్టు ఒక్క పరుగు తేడాతో ఆస్ట్రేలియా పై విజయం సాధిస్తుంది. ఇక భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి ఫామ్ అందుకున్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అతడు కటక్ లో భారీ సెంచరీ సాధించాడు. అద్భుతమైన షాట్లతో అందరినీ అలరించాడు. అతడు ఈ మెగా టోర్నీలో కూడా మంచి టచ్ లో కనిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ భారత జట్టుకు కీలకంగా మారనున్నాడు. రోహిత్ తన దూకుడును అలాగే కొనసాగించాలి. పవర్ ప్లే లో పరుగులు రాబట్టాలన్న అతడి ఉద్దేశంలో ఎలాంటి తప్పులేదు” అని చెప్పుకొచ్చాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ లో భారత జట్టు గెలుస్తుందన్న మైఖేల్ క్లార్క్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఇక ప్రస్తుతం టోర్ని విషయానికి వస్తే.. దాదాపు సెమీఫైనల్ జట్లపై పూర్తి క్లారిటీ వచ్చింది. గ్రూప్ ఏ నుండి భారత్, న్యూజిలాండ్.. గ్రూప్ బి నుండి ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా జట్లు సెమీఫైనల్ కి అర్హత సాధించాయి. ఇక ఈ టోర్నీలో టీమిండియా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్లలో గెలిచి సెమీఫైనల్ బెర్తుని ఖరారు చేసుకుంది భారత జట్టు. ఇక తన ఆఖరి లీగ్ మ్యాచ్ ని మార్చి రెండున న్యూజిలాండ్ తో ఆడేందుకు సిద్ధమైంది. దుబాయ్ వేదికగా ఆదివారం రోజు న్యూజిలాండ్ జట్టును ఢీకొడుతుంది భారత జట్టు.