Sridevi: శ్రీదేవి లేని లోటు సినీ పరిశ్రమలో ఎవరూ తీర్చలేనిది అని తన ఫ్యాన్స్ అంటుంటారు. ఎన్నో ఏళ్లుగా హీరోయిన్గా ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు చేసిన శ్రీదేవి.. ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు సాధించారు. ఎంతోమంది స్టార్ యాక్టర్లతో పనిచేశారు. తన తర్వాత తన వారసురాళ్లను హీరోయిన్స్గా ప్రేక్షకులకు పరిచయం చేయాలని అనుకున్నారు. కానీ ఇంతలోనే 2018లో శ్రీదేవి హఠాన్మరణం అందరినీ షాక్కు గురిచేసింది. చనిపోయే ముందు వరకు కూడా శ్రీదేవి సినిమాల్లో యాక్టివ్గానే ఉన్నారు. తాజాగా తన చివరి సినిమాకు రైటర్గా పనిచేసిన వ్యక్తి.. ఆ మూవీపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
చివరి సినిమా
షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘జీరో’ సినిమాలో కొన్ని సెకండ్ల కోసం గెస్ట్ రోల్లో కనిపించారు శ్రీదేవి. కానీ లీడ్ రోల్లో తన చివరి సినిమా మాత్రం ‘మామ్’. ఈ మూవీలో తన నటనకు బెస్ట్ యాక్ట్రెస్గా నేషనల్ అవార్డ్ కూడా దక్కించుకున్నారు. అంతలోపే ఆమె మరణించారు. ఈ సినిమాను రవి ఉద్యావర్ డైరెక్టర్ చేయగా.. గిరిష్ కోహ్లీ అనే వ్యక్తి ‘మామ్’తో రైటర్గా బాలీవుడ్లో అడుగుపెట్టాడు. ఈ సినిమాకు రైటర్గా పనిచేసిన అనుభవం గురించి, శ్రీదేవితో తనకు ఉన్న అనుభవం గురించి తాజాగా బయటపెట్టాడు గిరీష్. శ్రీదేవి లాంటి స్టార్తో ‘మామ్’లాంటి సినిమా తీయకుండా ఉండాల్సింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
అలాంటి సినిమా చేయాల్సింది
‘‘శ్రీదేవితో కలిసి పనిచేయడం ఇప్పటికీ నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆవిడ ఏమైనా చేయగలరు. ఏ పాత్రలో అయినా నటించగలరు. కానీ ఆవిడతో ఒక సీరియస్ సినిమా కోసం పనిచేశాను అన్నదే నా బాధ. ఆమె కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. నేను అది చూడగలిగాను. నేను ఆమెతో ఒక కామెడీ సినిమా చేసి ఉండాల్సింది. కానీ ఆ అవకాశం రాలేదు. శ్రీదేవి నాకు చాలా గౌరవం ఇచ్చేవారు. మామ్ (Mom) అనేది నా మొదటి సినిమా. అప్పటికీ నేను అసలు ఏమీ కాదు. అయినా కూడా నన్ను సార్ అని పిలిచేవారు. అది నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది’’ అంటూ శ్రీదేవిని ప్రశంసలతో ముంచేస్తూ.. తనతో కామెడీ సినిమా చేయలేకపోయానని ఫీల్ అయ్యాడు గిరీష్ కోహ్లీ (Girish Kohli).
Also Read: తమిళ దర్శకులు హీరోయిన్లను అలా చూస్తారు.. జ్యోతిక షాకింగ్ స్టేట్మెంట్
తల్లి పాత్రలో
‘‘శ్రీదేవి (Sridevi) అందరికీ చాలా మర్యాద ఇస్తారు. ఆమె ప్రతీ డైలాగ్ను స్వయంగా చదువుకునేవారు. ఇండస్ట్రీలో తనలాంటి వారు చాలా తక్కువ. అది ప్రేక్షకులకు తీరని లోటు’’ అని చెప్పుకొచ్చాడు గిరీష్ కోహ్లీ. ‘మామ్’ సినిమాలో ఒక తల్లి పాత్రలో కనిపించారు శ్రీదేవి. తన కూతురికి అన్యాయం చేసిన వారిని శిక్షించడం కోసం చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకునే తల్లి పాత్ర ఇది. ఈ సినిమా విడుదలయిన ఏడాది తర్వాతే శ్రీదేవి మరణించారు. అలా ఇది తన కెరీర్లో చివరి సినిమాగా మిగిలిపోయింది. ఈ మూవీతో పాటు అప్పటివరకు ఇండస్ట్రీలో తను కనబరిచిన నటనకు, అందించిన ఎంటర్టైన్మెంట్కు ప్రభుత్వం తనకు నేషనల్ అవార్డ్ను ప్రకటించింది.