Pant.. Sanju : భారత క్రికెట్ అభిమానులందరిదీ ఇప్పుడు ఇదే మాట. వికెట్ కీపర్స్ కమ్ బ్యాటర్లు అయిన రిషబ్ పంత్, సంజూ శాంసన్ విషయంలో BCCI, టీమిండియా ఎందుకు వివక్ష చూపిస్తోందని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. పంత్ కన్నా వెయ్యి రెట్లు బెటర్ అయిన సంజూను పదే పదే ఎందుకు బెంచ్ కే పరిమితం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
BCCI, టీమిండియాపై ఫ్యాన్స్ ఫైరవడానికి కారణం ఉంది. ఇటీవలి T20 వరల్డ్ కప్ లోనూ, న్యూజిలాండ్ తో T20 సిరీస్ లోనూ పంత్ ఘోరంగా విఫలమయ్యాడు. అయినా సంజూకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకుండా పదే పదే పంత్ నే ఎందుకు ఆడనిస్తున్నారని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. న్యూజిలాండ్తో మూడో T20లోనూ పంత్ తక్కువ స్కోరుకే ఔటవడంతో… ఫ్యాన్స్ ఆగ్రహం పట్టలేకుండా ఉంది. పంత్ను, అతన్ని వెనకేసుకొస్తున్న BCCIని, టీమిండియాను ఏకి పారేస్తున్నారు. ఇద్దరి గణాంకాలను ప్రస్తావించి సోషల్మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు.
సంజూ 2015లో అంతర్జాతీయ T20 కెరీర్ మొదలెట్టినా… ఏడేళ్లలో ఆడింది కేవలం 16 మ్యాచ్లే. 2017లో పొట్టి క్రికెట్లోకి అరంగేట్రం చేసిన పంత్ మాత్రం… ఏకంగా 65 T20లు ఆడాడు. పంత్ అంటే ప్రేమ, సంజూ అంటే వివిక్ష అని చెప్పడానికి ఈ అంకెలు సరిపోవా? అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క T20ల్లోనే కాదు.. వన్డేలు, టెస్ట్ల్లోనూ సంజూకు అన్యాయం జరిగిందని చెబుతున్నారు. ఏడేళ్ల కెరీర్లో సంజూకు కేవలం 10 వన్డేల్లోనే ఛాన్స్ ఇస్తారా? అని మండిపడుతున్నారు. ఇక టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సంజూ అస్సలు పనికిరాడా? అని ఆవేశ పడిపోతున్నారు. అదే పంత్ అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చిన ఐదేళ్లలో 27 వన్డేలు, 31 టెస్టులు ఎలా ఆడతాడని ప్రశ్నిస్తున్నారు. ఎక్కువ ఛాన్సులు ఇవ్వడానికి పంత్ ఏమైనా ఇరగదీస్తున్నాడా? అనేది ఫ్యాన్స్ ఆవేదన.
సంజూకు భారత్ తరపున ఆడే అవకాశం ఇవ్వకపోతే ఇతర లీగ్ల్లో ఆడుకునే అవకాశమైనా ఇవ్వండి… ఎందుకు అతని కెరీర్ నాశనం చేస్తారని ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. మరికొందరైతే పంత్ను తప్పించి సంజూ శాంసన్కు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకొందరు… పంత్కు ఇచ్చినన్ని అవకాశాలు భారత క్రికెట్ చరిత్రలోనే ఎవ్వరికీ ఇవ్వలేదని… అతనిపై అందరికీ ఎందుకంత ప్రేమ అని నిలదీస్తున్నారు. అభిమానుల ఆగ్రహం చూశాకైనా BCCIలోనూ, టీమిండియాలోనూ మార్పు వస్తుందేమో చూడాలి.