Yuvraj Singh ICC Ambassador For T20 World Cup 2024: ఒకే ఓవర్ లో ఆరు సిక్సర్లు కొట్టి చరిత్ర సృష్టించిన యువరాజ్ సింగ్ కు ఐసీసీ కీలక బాధ్యతలు అప్పగించింది. త్వరలో ప్రారంభం కానున్న టీ 20 వరల్డ్ కప్ 2024కు అంబాసిడర్ గా యువరాజ్ సింగ్ ను నియమించింది. యూనివర్శల్ బాస్ క్రిస్ గేల్, ఇంకా ఎనిమిది సార్లు స్వర్ణ పతాక విజేత ఉసేన్ బోల్ట్ తో కలిసి టీ 20 ప్రపంచకప్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తాడని ఐసీసీ ప్రకటించింది.
యువరాజ్ సింగ్ అంటేనే టీ 20 స్పెషలిస్ట్ గా చెబుతారు. టీ 20 మ్యాచ్ లు పెట్టిన కొత్తలో, ఇలా ఆడాలని ఆడి చూపించిన వాడు యువరాజ్ సింగ్ అనేది అందరికీ తెలిసిన విషయమే. 2007 టీ 20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో యువరాజ్ పూనకం వచ్చినట్టు ఊగిపోయాడు.
స్టువర్ట్ బ్రాడ్ వేసిన 19వ ఓవర్ లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టి రికార్డ్ సృష్టించాడు. ఈ క్రమంలో 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసి మరో రికార్డ్ సాధించాడు. టీ 20 ప్రపంచకప్ అనగానే యువరాజ్ చేసిన ఫీట్ ను అందరూ తప్పక గుర్తు చేసుకుంటారు.
ఇంతకీ అంబాసిడార్ గా యువరాజ్ చేసే పనేమిటయ్యా అంటే…ఐసీసీ టీ 20 వరల్డ్ కప్ టోర్నమెంటులో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ తో సహా యూఎస్ ఏ లో జరిగే మొత్తం మ్యాచ్ ల ప్రమోషన్ బాధ్యతలను యువరాజ్ కు ఐసీసీ అప్పగించింది.
తన పేరును ఐసీసీ ప్రకటించిన నేపథ్యంలో యువరాజ్ సింగ్ స్పందిస్తూ ఇలాంటి మెగా ఈవెంట్ లో మరోసారి భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నాడు. అయితే టీ 20 అనగానే ఎన్నో జ్ణాపకాలతో ముడిపడి ఉందని అన్నాడు. ఇక రాయబారిగా నా బాధ్యతలు నిర్వర్తించడానికి ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని అన్నాడు.
Also Read: ఆర్చరీ వరల్డ్ కప్లో సత్తా చాటిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం..
ఈ ఏడాది టీ 20 ప్రపంచకప్ ను అమెరికా, వెస్టిండీస్ వేదికగా జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం 20 జట్లు నాలుగు గ్రూప్ లుగా విడిపోయి పోటీ పడతాయి. పాకిస్తాన్, అమెరికా, ఐర్లాండ్, భారత్ ఒక గ్రూప్ లో ఉన్నాయి. జూన్ 9న న్యూయార్క్ వేదికగా ఇండియా-పాక్ మధ్య పోరు జరగనుంది.