Awards: స్వేచ్ఛ బ్యూరో: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక రాష్ట్రస్థాయి ఉత్తమ సేవా పురస్కారాల్లో హుజూరాబాద్ ప్రాంతానికి చెందిన 108 సిబ్బంది దక్కాయి.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ రూరల్ 108 వాహనంలో విధులు నిర్వహిస్తున్న ఈఎంటి (EMT) రొంటాల సురేష్ కుమార్, పైలట్ సుంకరి అశోక్ రెడ్డిలకు రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు.
మంగళవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చేతుల మీదుగా వీరికి అవార్డులను అందజేశారు. ఆపదలో ఉన్న వారికి సకాలంలో స్పందిస్తూ, ఎంతో మంది ప్రాణాలను కాపాడటంలో వీరు చూపిన నిబద్ధతను ప్రభుత్వం గుర్తించింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టియానో, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ తదితర ఉన్నతాధికారులు పాల్గొని వీరిని అభినందించారు.
Also Read: హైడ్రా ఎంట్రీతో టౌన్ ప్లానింగ్ బండారం బట్టబయలు.. మరీ ఇంత దారుణమా..?
రాష్ట్రస్థాయిలో హుజూరాబాద్కు గుర్తింపు తెచ్చిన సురేష్ కుమార్ అశోక్ రెడ్డిలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ భూమా నాగేందర్, జిల్లా ఈఎంఈ సయ్యద్ ఇమ్రాన్, లు ప్రత్యేకంగా అభినందించారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే సిబ్బందికి ఇలాంటి అవార్డులు మరింత ఉత్సాహాన్నిస్తాయని వారు పేర్కొన్నారు.
హుజూరాబాద్ రూరల్ పరిధిలో అలుపెరగని సేవలు అందిస్తున్న 108 సిబ్బందికి రాష్ట్ర స్థాయి అవార్డులు రావడం పట్ల స్థానిక ప్రజలు మరియు తోటి సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపత్కాలంలో ప్రాణదాతలుగా నిలుస్తున్న వీరి సేవలు మరెందరికో స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు.
Also read: పెళ్లి ముందు వరుడు జంప్.. అదనపు కట్నం కోసం పెళ్లికొడుకు పరారీ!