Fake Call Centre : హలో అని పలకరిస్తారు.. సున్నితమైన సమాచారాన్ని ఏదో తీరుగా సేకరిస్తారు. ఆపై బ్యాంకు ఖాతాలు ఖాళీ చేయడం, అక్రమ మార్గాల్లో సంపాదించిన డబ్బుల్ని తెలివిగా క్రిఫ్టో కరెన్సీగా మార్చుతూ.. కోట్లకు ఎగబాకిన ఓ కేటుగాళ్లు ముఠాను హైదరాబాద్ లో పోలీసులు గుర్తించారు. సైబర్ క్రైమ్ పోలీసులు నిర్వహించిన దాడుల్లో ఈ నకీలీ సంస్థ వ్యవహారం బట్టబయలు కాగా.. ఇక్కడి నుంచి అనేక అక్రమ లావాదేవీలు, చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నట్లుగా గుర్తించారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న 65 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
నకిలీ ఫోన్ కాల్స్ చేస్తూ అమెరికాలో ఉంటున్న భారతీయుల్ని టార్గెట్ గా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ముఠాలపై ఫోకస్ పెట్టిన పోలీసులు.. మార్చి 6 బుధవారం నాడు మాదాపూర్లోని ఒక భవనంపై దాడులు నిర్వహించారు. ఇక్కడ ఓ కాల్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) అధికారులు గుర్తించారు. చట్టబద్ధమైన వ్యాపారం ముసుగులో నడుస్తున్న ఈ మోసపూరిత ఆపరేషన్, రోజూ వందలాది మంది అమెరికాలోని ఇండియన్లను మోసం చేస్తున్నట్లు గుర్తించారు.
కీలక నిందితుడు అరెస్ట్
ఈ దాడుల గురించి TGCSB డైరెక్టర్ శిఖా గోయెల్ వివరాలు వెల్లడించారు. మాదాపూర్ లో నిర్వహిస్తున్న ఈ కాల్ సెంటర్ వెనుక ప్రధాన నిందితులు గుజరాత్కు చెందిన కైవన్ పటేల్, రూపేష్ కుమార్ అలియాస్ జడ్డుగా గుర్తించారు, వీరిలో రూపేష్ దుబాయ్కు చెందిన సోదరుడు విక్కీ, మరొక సహచరుడు ఆజాద్ లను కూడా నిందితులుగా గుర్తించారు. వీరితో పాటుగా ప్రధాన అనుమానితురాలిగా ఉన్న చందా మనస్విని (36) అనే యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఈమె ఎగ్జిటో సొల్యూషన్స్ అనే నకిలీ కంపెనీని స్థాపించి.. ఈశాన్య రాష్ట్రాల నుంచి 40 మందితో సహా 63 మంది ఉద్యోగులను నియమించుకుంది. ఉద్యోగులకు నెలకు రూ. రూ.30,000 జీతం, రవాణా, వసతితో పాటు ఇతర అలెవెన్సులు ఇస్తూ.. ఉద్యోగాల్లో నియమించుకున్నారు.
ఇలా మోసం చేస్తున్నారు
వీరంతా పేపాల్ ప్రతినిధులుగా బాధితులకు పరిచయం అయ్యి.. అమెరికా పౌరులకు అనధికార లావాదేవీల గురించి తప్పుడు సమాచారం అందించే టెలి-కాలర్లుగా పని చేస్తున్నారు. బాధితుల సున్నితమైన బ్యాంకింగ్ సమాచారాన్ని బహిర్గతం చేసేలా మోసగించి, ఆ సమాచారాన్ని నిధులను మళ్లించడానికి ఉపయోగిస్తున్నారు. ప్రతి కాలర్ రోజుకు కనీసం 10 మందిని మోసం చేయాలనే టార్గెట్ పెట్టుకుని పని చేస్తుండగా.. సగటున రోజుకు 600 మంది బాధితులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. బాధితుల నుంచి అక్రమంగా దొంగిలించిన డబ్బును క్రిప్టోకరెన్సీగా మార్చి డిజిటల్ వాలెట్లకు బదిలీ చేస్తున్నారు.
ఈ కాల్ సెంటర్ నుంచి పోలీసులు 52 ల్యాప్టాప్లు, 63 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. 27 ఉద్యోగుల గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నారు. పేపాల్ కస్టమర్ డేటాను ఇన్సైడర్ యాక్సెస్ చేయడం వల్ల ఈ స్కామ్ జరిగిందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. రూపేష్ కుమార్ను ట్రాక్ చేయడానికి, మోసపూరిత నెట్వర్క్ పూర్తి స్థాయిని వెలికితీసేందుకు అధికారులు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.
Also Read : Rare Cat In Telangana: హుజూర్నగర్లో అరుదైన పిల్లి.. పట్టుకుంటే చనిపోయే ప్రమాదం!
ఇక్కడ టెలీ కాలర్లుగా పని చేస్తున్న వారంతా.. ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడే వాళ్లు కాగా, వీళ్లు బాధితుల్ని ఎలా మోసగించాలనే విషయంలో శిక్షణ పొందినట్లుగా, వారి చేస్తున్న పనులపై, అవి చట్టవిరుద్ధం అనే విషయాలపై పూర్తి అవగాహన ఉందని పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన కుట్రదారులతో పాటుగా కాల్ సెంటర్లో పని చేస్తున్న వారిని కూడా నిందితులుగా చేర్చిన పోలీసులు.. వారిపై సైబర్ క్రైమ్ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయనున్నారు.