Sarpanch Elections: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడూ ఆసక్తికరంగా జరుగుతాయి. కొన్ని ప్రాంతాల్లో పార్టీల మధ్య, మరికొన్ని చోట్ల వ్యక్తుల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంటుంది. అయితే మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.. ఇక్కడ ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు వేర్వేరు పార్టీల తరపున పోటీ పడుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఈ అన్నదమ్ముల సవాల్తో నెల్లికుదురు గ్రామ రాజకీయం వేడెక్కింది.
నెల్లికుదురు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నిక బరిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పులి రామచంద్రు నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన సోదరుడు పులి వెంకన్న పోటీ చేస్తున్నారు. ఒకరు అధికార పార్టీ అభ్యర్థిగా.. మరొకరు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా ప్రజల ముందుకు వచ్చారు. నువ్వా..? నేనా..? అన్నట్లు వారిద్దరూ తమ ప్రచారాన్ని హోరాహోరీగా కొనసాగిస్తున్నారు. ఈ పోటీ స్థానికుల్లో ఉత్కంఠ పెంచింది. ఎవరు గెలుస్తారో అనే చర్చ మండలమంతా సాగుతోంది.
గత ప్రభుత్వ పాలనలో నెల్లికుదురు ప్రాంతంలో బీఆర్ఎస్ హవా బలంగా ఉండేది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి అంతంత మాత్రంగానే ఉంది. ఈసారి బీఆర్ఎస్ ప్రభావాన్ని తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. ఇలాంటి కీలక తరుణంలో అన్నదమ్ములు ప్రధాన పార్టీల నుండి బరిలో నిలవడం ఈ ఎన్నిక ప్రత్యేకత. పులి రామచంద్రు, పులి వెంకన్న ఇద్దరూ మండల కేంద్రంలోని ప్రతి గడపకూ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తమను గెలిపిస్తే గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి పులి రామచంద్రు తమ పార్టీకి మండల ప్రజల ఆశీస్సులు లభిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, కాంగ్రెస్ అభ్యర్థి పులి వెంకన్న తమ గెలుపుకు ప్రజల మద్దతుతోపాటు స్థానిక ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్, ఎంపీ బలరాం నాయక్ అండదండలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ ఇద్దరు నాయకుల మద్దతు తమకు అదనపు బలం అవుతుందని ఆయన నమ్ముతున్నారు. ప్రముఖ నాయకుల ఆశీస్సులు తమ వెంటే ఉన్నాయనే ప్రచారం వెంకన్న బలాన్ని పెంచుతోంది.
గెలిచేది ఎవరు..?
రాజకీయాల్లో కుటుంబ బంధాలు, పార్టీల సిద్ధాంతాలు కొన్నిసార్లు పోటీ పడతాయి. నెల్లికుదురులో జరుగుతున్న ఈ ఎన్నిక అలాంటి సన్నివేశమే సృష్టిస్తోంది. కుటుంబంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు రాజకీయంగా వేర్వేరు దారుల్లో నడుస్తున్నారు. అన్నదమ్ముల మధ్య జరుగుతున్న ఈ బస్తీమే సవాల్ తరహా పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. ఎన్నికల ఫలితాలు ఈ ఆసక్తికర పోటీకి తెరదించుతాయి. నెల్లికుదురు సర్పంచ్ పీఠం పులి రామచంద్రుకు దక్కుతుందా, లేక పులి వెంకన్న గెలుస్తారా అనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. గ్రామాభివృద్ధి లక్ష్యంగా సాగుతున్న ఈ ఎన్నికల ప్రచారం చివరి ఘట్టానికి చేరుకుంది.
ALSO READ: Floriculture: సొంతూరిలోనే లక్షలు సంపాదించే బిజినెస్ – ఇంత వరకు ఎవ్వరూ చెప్పని వ్యాపారం ఇదే