Hyderabad News: తెలంగాణ రాష్ట్ర సచివాలయం సౌత్ ఈస్ట్ ఎంట్రెన్స్ వద్ద ఈరోజు ఒక ప్రమాదం జరిగింది. ఎంట్రెన్స్ వద్ద ఏర్పాటు చేసిన అండర్ వెహికిల్ స్కానర్ గ్రిల్ లో ప్రమాదవశాత్తూ ఒక మహిళా ఉద్యోగి కాలు ఇరుక్కుపోయింది. ఈ ఘటనతో సచివాలయం ప్రాంగణంలో కాసేపు కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
సచివాలయం ప్రవేశ ద్వారం వద్ద విధుల్లో ఉన్న మహిళా ఉద్యోగి నడుస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. స్కానర్ గ్రిల్ మధ్యలో కాలు ఇరుక్కుపోవడంతో ఆమె తీవ్ర నొప్పికి గురైంది. కాలును బయటకు తీయడం ఎవరి వల్లా కాలేదు. విషయం తెలుసుకున్న ఎస్ఆర్ఎఫ్ (స్పెషల్ రిజర్వ్ ఫోర్స్) సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
సమయం వృథా చేయకుండా ఎస్ఆర్ఎఫ్ అధికారులు స్కానర్ గ్రిల్ ను కట్టర్ సహాయంతో కట్ చేశారు. ఎంతో శ్రమించి జాగ్రత్తగా మహిళా ఉద్యోగి కాలును బయటకు తీశారు. ఆమెకు స్వల్ప గాయాలు మాత్రమే కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రాణాపాయం తప్పడంతో అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. భద్రతా వ్యవస్థలో కీలకమైన స్కానర్ గ్రిల్ వద్ద భద్రతా చర్యలు మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని ఈ ఘటన గుర్తు చేసింది.
ALSO READ: Weather News: బంగాళఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రంలో రెండు రోజులు భారీ వర్షాలు