Addanki Dayakar: గత పదేళ్ల పాలనలో కేసీఆర్ జల్సా చేస్తే.. హరీష్ రావు, కేటీఆర్ అంతకు మించి వ్యవహరించి రాష్ట్రాన్ని దోచుకున్నారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆరోపించారు. హైదరాబాద్లోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్లో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు 2.0 వెర్షన్ నుండి 3.0 కు మారిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావడం అనేది ఎన్నటికీ జరగని పని అని ఆయన జోస్యం చెప్పారు. శారదా పీఠం భూముల వ్యవహారంపై స్పందిస్తూ.. ఆ రెండు ఎకరాల భూమిని ఏం చేద్దామో హరీష్ రావు, బండి సంజయ్ చెప్పాలని దయాకర్ డిమాండ్ చేశారు.
శారదా పీఠం నిర్వాహకులకే లేని కడుపునొప్పి హరీష్ రావుకు.. బండి సంజయ్కు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. హరీష్ రావుకు మానసిక ప్రశాంతత కావాలంటే శారదా పీఠానికి వెళ్లి ధ్యానం చేసుకోవాలని హితవు పలికారు. శారదా పీఠం భూములకు రియల్ ఎస్టేట్తో ముడిపెట్టడం ఏమాత్రం సబబు కాదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటే శారదా పీఠం భూములతో పనిలేదని.. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పేదవారు ఉంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనందిస్తుందని పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లాలోని భూదాన్ భూములపై త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయని ఆయన వెల్లడించారు. కొల్లూర్ సమీపంలో కేసీఆర్ నగర్ నిర్మించినా.. గత ప్రభుత్వం పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. పేదల సంక్షేమం పట్ల బీఆర్ఎస్ నాయకులకు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. అర్బన్ హౌసింగ్ పథకాలకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని.. ఇంకా 500 కోట్ల రూపాయల ఫండ్ పెండింగ్లో ఉందని గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని మరింత విస్తరిస్తామని అద్దంకి దయాకర్ తెలిపారు. ఈ పథకం ద్వారా పేదలకు మరింత న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బీఆర్ఎస్, బీజేపీ నాయకులు వాస్తవాలను గ్రహించి మాట్లాడితే మంచిదని ఆయన సూచించారు. అసత్య ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూడవద్దని హెచ్చరించారు.