Addanki Dayakar: తెలంగాణ ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, దక్షిణాది రాజకీయ పక్షాలపై నిప్పులు చెరిగారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) అంశాలను అడ్డం పెట్టుకుని బీజేపీ దేశంలో తన రాజకీయ ఆధిపత్యాన్ని పెంచుకోవాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. ఈ తరుణంలో దక్షిణాదికి చెందిన పార్టీలు బీజేపీకి మద్దతు తెలపడం వారి అవగాహన రాహిత్యమో లేక బానిస మనస్తత్వమో అర్థం కావడం లేదని మండిపడ్డారు. “బీజేపీ అంటే బానిసల జనతా పార్టీ.. కేంద్రం ఏం చెబితే ఇక్కడి నేతలు అది చేస్తారు.” అని ఆయన ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై శాస్త్రీయంగా.. ఒక ప్రాంత అస్తిత్వ సమస్యగా మాట్లాడుతుంటే, దానిని అర్థం చేసుకోకుండా కిషన్ రెడ్డి వంటి నేతలు విమర్శలు చేయడం విచిత్రంగా ఉందని దయాకర్ పేర్కొన్నారు. “దక్షిణాది రాష్ట్రాలు కేవలం కేంద్రానికి నిధులు చెల్లించడానికి మాత్రమే పరిమితం కావాలా? రాజకీయంగా మాకు విలువ ఉండదా?” అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు వంటి అనుభవం ఉన్న నేతలు కూడా దీనిపై మౌనం వహించడం రేపు దక్షిణాదికి జరగబోయే నష్టానికి మద్దతు తెలపడమేనని, అటువంటి పార్టీలకు ఇక్కడ రాజకీయం చేసే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు.
బాబాసాహెబ్ అంబేడ్కర్ చెప్పిన “వన్ మ్యాన్ – వన్ ఓట్ – వన్ వాల్యూ..” సూత్రానికి బీజేపీ తూట్లు పొడుస్తోందని దయాకర్ విమర్శించారు. ఉత్తరాదిలో ఎక్కువ సీట్లు వస్తే చాలు, దక్షిణాదితో పనిలేదు అనే ధోరణిలో కేంద్రం ఉందన్నారు. 850 పార్లమెంట్ సీట్లలో 600 పైగా ఉత్తరాదికే పరిమితమైతే, రేపు దక్షిణాది ఓటుకు విలువ ఏముంటుందని ఆయన నిలదీశారు. ఇది ఒక ప్రాంతం మీద మరొక ప్రాంతం ఆధిపత్యం చెలాయించడమేనని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. అంబేడ్కర్ ఆరోజే దక్షిణాది ప్రాధాన్యత పెరగాలని హైదరాబాద్ను రెండో రాజధానిగా చేయమన్నారని గుర్తు చేశారు.
చర్చ లేకుండా మూజువాణి ఓటుతో బిల్లులను పాస్ చేయించుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని అద్దంకి దయాకర్ అన్నారు. ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు తెలిపే పార్టీలు దక్షిణాదికి చారిత్రక ద్రోహం చేస్తున్నాయని హెచ్చరించారు. దక్షిణాది అస్తిత్వం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుండి పోరాడుతారని, ఆయన వెనుక యువత అంతా సిద్ధంగా ఉన్నారని భరోసా ఇచ్చారు. కేంద్రం కుట్రదారుగా మారి తీసుకుంటున్న నిర్ణయాలను ప్రశ్నించకపోతే భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించవని ఆయన స్పష్టం చేశారు.
Read Also: కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ ఆగమైంది.. దోమలు, దొంగలకే పండగ.. కేటీఆర్ సెటైర్లు