CM Revanth Reddy: కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అసత్య ప్రచారాలపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. వాస్తవాలు బయటకి రాకముందే అబద్ధాలు వైరల్ చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ కంటెంట్ పై విచారణ జరపాలని కోర్టును కోరుతామని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
‘ఫేక్ వీడియోలను అరికట్టేందుకు ఫోరెన్సిక్ టూల్స్ ను సిద్దం చేశాం. ఫేక్ కంటెంట్ భవిష్యత్తులో యుద్ధాలకు బీజం వేస్తుంది. సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలి. జింకలు, నెమళ్లతో విడుదలైన వీడియోలు అన్నీ ఫేక్. ఏఐ ఆధారంగా తప్పుడు వీడియోలు వైరల్ చేశారు. నిజాలను మార్చే ఫేక్ వీడియోలు ప్రమాదకరం. ఏఐ ఫేక్ వీడియోలు కరోనా కంటే ప్రమాదకరం’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
‘కంచె గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25 లో ఉన్న భూముల్లో గత 25 ఏండ్లుగా ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారు. ఐఎస్బీతో పాటు గచ్చిబౌలి స్టేడియం, ఐఐఐటీ, ప్రైవేటు బిల్డింగ్లు, రెసిడెన్షియల్ అపార్టుమెంట్లు, హైదరాబాద్ యూనివర్సిటీ భవనాలను నిర్మించారు. వాటిని నిర్మించే సందర్భాల్లో ఎలాంటి వివాదాలు, ఆందోళనలు జరగలేదని అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి దృష్టికి తెచ్చారు. అప్పుడు వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ విధ్వంసం లాంటి వివాదాలు కూడా లేవన్నారు. అలాంటప్పుడు అదే సర్వే నెంబర్ లోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేసేటప్పుడు ఎందుకు వివాదాస్పదమైందని అంశంపై సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించారు.
అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లుగా వీడియోలు, ఫొటోలు సృష్టించి కొందరు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయటంతో ఈ వివాదం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసిందని అధికారులు వివరించారు. వాస్తవాలు వెల్లడించే లోగా అబద్ధాలు సోషల్ మీడియాలో జాతీయ స్థాయిలో వైరల్ కావడం ప్రభుత్వానికి సవాలుగా మారిందని అధికారులు సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. ఏకంగా నెమళ్లు ఏడ్చినట్లుగా ఆడియోలు, బుల్డోజర్లకు జింకలు గాయపడి పరుగులు తీస్తున్నట్లుగా ఫేక్ ఫొటోలు, వీడియోలు తయారు చేశారని పోలీసు అధికారులు సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు.
వివిధ రంగాల్లో పేరొందిన ప్రముఖులు కూడా వాటినే నిజమని నమ్మి సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పెట్టడంతో అబద్ధాలకు ఆజ్యం పోసినట్లయిందని అన్నారు. ఏకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధ్రువ్ రాఠీ, సినీ ప్రముఖులు జాన్ అబ్రహం, దియా మీర్జా, రవీనా ఠండన్ లాంటి వారందరూ ఏఐ ద్వారా సృష్టించిన ఫేక్ ఫొటోలు, వీడియోల పోస్టు చేసి సమాజానికి తప్పుడు సందేశం చేరవేశారన్న చర్చ సమావేశంలో జరిగింది. ఈ భూములపై మొట్టమొదటగా ఫేక్ వీడియో పోస్ట్ చేసిన జర్నలిస్ట్ సుమిత్ ఝా కొద్ది సేపట్లోనే తన పోస్టును తొలిగించి క్షమాపణలు చెప్పారని, కానీ మిగతా ప్రముఖులెవరూ ఈ నిజాన్ని గుర్తించకుండా అదే ఫేక్ వీడియో ప్రచారం చేశారని అధికారులు వివరించారు.
కంచె గచ్చిబౌలిలో ఏఐ సృష్టించిన వివాదం ప్రజాస్వామ్య వ్యవస్థలకే పెను సవాలు విసిరిందన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. ఇదే తరహాలో ఇండో పాక్, ఇండో చైనా సరిహద్దుల్లాంటి వివాదాలు, ఘర్షణలకు దారితీసే సున్నితమైన అంశాల్లో ఏఐతో ఫేక్ కంటెంట్ సృష్టిస్తే భవిష్యత్తుల్లో యుద్ధాలు జరిగే పెను ప్రమాదముంటుందని చర్చ జరిగింది. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రంలో సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఏఐ ఫేక్ కంటెంట్ను గుర్తించడానికి అవసరమైన అధునాతన ఫోరెన్సిక్ హార్డ్వేర్, సాఫ్ట్ వేర్ టూల్స్ను సమకూర్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.
ALSO READ: Telangana Jobs: గుడ్ న్యూస్.. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 390 ఉద్యోగాలు.. ఇంకా వారం రోజులే..!