Hospital Controversy: స్వేచ్ఛ బ్యూరో: తొర్రూరు పట్టణంలోని విజయలక్ష్మి హాస్పిటల్పై వరుసగా వస్తున్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఇప్పటికీ కఠిన చర్యలు తీసుకోకపోవడం స్థానికుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. ప్రతి ఘటన తర్వాత షోకాజ్ నోటీసులు జారీ చేసి, విచారణ జరుగుతోందని చెప్పడమే తప్ప, వాస్తవానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటీవల డాక్టర్ కిరణ్ కుమార్పై వచ్చిన ఆరోపణలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఇదే తరహా ఆరోపణలు గతంలో కూడా వచ్చినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పునరావృతమవుతున్న సంఘటనలు ఉన్నప్పటికీ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంపై బీఎస్పీ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ అధ్యక్షులు ఈధునూరి ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. తొర్రూరులో ఏ ఘటన జరిగినా కూడా డిఎంహెచ్ఓ షోకాజ్ నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారని అన్నారు. నెలలు గడిచినా విచారణ పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు అని విమర్శించారు. ప్రజలు ప్రశ్నించినప్పుడు ‘విచారణ జరుగుతోంది’ అనే సమాధానం తప్ప, స్పష్టమైన చర్యలు కనిపించడం లేదన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా చోటుచేసుకుంటున్న ఘటనలపై కూడా ఇదే విధానం కొనసాగుతోందని ఆయన ఆరోపించారు.
Also read: కరీంనర్లో ఓ కవికి దక్కిన జాతీయ స్థాయి అరుదైన గౌరవం..?
నోటీసులు జారీ చేసిన తర్వాత వాటి ఫలితాలపై ఎలాంటి స్పష్టత లేకుండా వ్యవహరించడం వల్ల ప్రజల్లో నమ్మకం కోల్పోతున్నారని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరగాలంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, విజయలక్ష్మి హాస్పిటల్పై పూర్తి స్థాయి విచారణ జరిపి, నిజానిజాలు వెలుగులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. తొర్రూరు పట్టణంలో ప్రజల భద్రత, నమ్మకం కాపాడడం ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతగా భావించి, తక్షణమే స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని వారు కోరారు.
Also Read: పక్కన కూర్చుంటే తప్పేంటి.. ప్రోటోకాల్ ఉల్లంఘనా.. మేయర్ మమత ఫైర్..?