MLA Prakash Goud joins congress(Telangana politics): మరో బీఆర్ఎస్ వికెట్ పడింది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసిన కారు పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. అధికార పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది వరకే ఏడుగురు ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు. తాజాగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా ఇదే బాటలో వెళ్లుతున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ రేపు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయన సమక్షంలోనే కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్తోపాటు మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్లు, ఇతర నాయకులు కూడా కాంగ్రెస్లో చేరుతున్నారు. ఇది వరకే ప్రకాశ్ గౌడ్ గతంలో సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకోవడం చర్చనీయాంశమైంది. అభివృద్ధి కార్యక్రమాల కోసమే మర్యాదపూర్వకంగా సీఎంను కలిసినట్టు ప్రకాశ్ గౌడ్ గతంలో వివరణ ఇచ్చారు.
వలసలకు చెక్ పెట్టడానికి కారు పార్టీ నానాయాతన పడుతున్నది. మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్హౌజ్లో వరుస సమావేశాలు నిర్వహించారు. ఎవరూ పార్టీని వీడొద్దని, కష్టకాలంలో వెంటనడిచిన వారికి భవిష్యత్లో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ పార్టీనేనని భరోసా ఇచ్చారు. కాబట్టి, ఎమ్మెల్యేలు పార్టీ మారొద్దని విజ్ఞప్తి చేశారు. మీటింగలో కేసీఆర్ ముందు సరేనని చెప్పినట్టే చెప్పి బయటికి వచ్చాక తమ దారి తాము చూసుకుంటున్నట్టు పార్టీ అధిష్టానం కూడా భావించింది. అందుకే ఫిరాయింపుల చట్టం, దాని ద్వారా వలసలను ఆపడానికి సంబంధించి విలువైన సలహాలు, సూచనలను నిపుణుల నుంచి కేటీఆర్, హరీశ్ రావు తీసుకున్నట్టు సమాచారం. మరి ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన బావ బామ్మర్దులు ఎమ్మెల్యేల వలసలకు ఎలా అడ్డుకట్ట వేస్తారో వేచి చూడాల్సిందే.
తమ నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించే అధికార పార్టీలో చేరుతున్నామని వలసలు వస్తున్న ఎమ్మెల్యేలు చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ గతంలో ప్రలోభ పెట్టి, కొందరిని బలవంతంగా పార్టీలోకి తీసుకుందని కాంగ్రెస్ నాయకులు గుర్తు చేస్తున్నారు. కానీ, తాము ఏ ఎమ్మెల్యేలనూ ప్రలోభపెట్టడం లేదని, వారే పార్టీలోకి వస్తామని ముందుకు వస్తున్నారని, తాము స్వాగతిస్తున్నామని చెబుతున్నారు.
ఇది వరకే బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, కాలె యాదవయ్య, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా రేపు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో రాజేంద్రనగర్కు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా కాంగ్రెస్లో చేరుతున్నారు.