Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై సుబేదారి పోలీస్స్టేషన్లో మరో కేసు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని యూత్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. దళిత ఎమ్మెల్యేలు, మంత్రుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో నిన్న బెయిల్ వచ్చిన తర్వాత మంత్రి సీతక్క, కడియం శ్రీహరిలపై కౌశిక్రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కౌశిక్రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నేతల డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ వ్యవహారంలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు జరిగాయి. 14 రోజుల రిమాండ్ విధించిన కొద్దిసేపట్లోనే ఆయనకు కోర్ట్ షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో పోలీసుల రిమాండ్ పిటిషన్ను తిరస్కరించిన కాజీపేట కోర్టు.. కౌశిక్రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. హనుమకొండ సుబేదారి పోలీసులు ఆయనను శంషాబాద్ ఎయిర్పోర్టులో అరెస్ట్ చేసి వరంగల్కు తరలిచారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు.
మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెస్ట్ వ్యవహారం.. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం రేపుతోంది. రేవంత్ సర్కార్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుంని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. తనపై నమోదైనవన్నీ అక్రమ కేసులేనన్నారు కౌశిక్ రెడ్డి. జిల్లాలో జరుగుతున్న స్కాములన్నీ ప్రెస్మీట్ పెట్టి బయటపెడతానన్నారు. జైలుకు పంపాలని ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదని తేల్చిచెప్పారు. మంత్రులు ఇసుక దందాలు, భూ కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు.
క్వారీ యజమాని మనోజ్రెడ్డిని కౌశిక్రెడ్డి చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని మనోజ్రెడ్డి భార్య ఉమాదేవి.. సుబేదారి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన భర్తను కౌశిక్రెడ్డి బెదిరించి 25 లక్షలు తీసుకున్నారన్నారు. మరో 50 లక్షలు ఇవ్వకపోతే తన భర్తను, కుటుంబ సభ్యులను చంపుతానని కౌశిక్రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఉమాదేవి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదుతో కౌశిక్రెడ్డిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే కేసులో కౌశిక్రెడ్డిని హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు సుబేదారి పీఎస్కు తరలించారు.
Also Read: క్షుద్రపూజలు చేసి మాగంటిని నేనే చంపేశా..15 రోజుల్లో నిన్ను కూడా.. సంధ్య శ్రీధర్ రావు ఆడియో లీక్
కౌశిక్రెడ్డిని అరెస్ట్ చేయడంతో సుబేదారి పీఎస్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. సుబేదారి పోలీస్ స్టేషన్ ముందు సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు యత్నించడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం భారీ భద్రత మధ్య ఆయనకు వరంగల్ ఎమ్జీఎమ్ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఖాజీపేట కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఆ తర్వాత నాటకీయ పరిణామాల మధ్య రిమాండ్ విధించడం.. ఆ తర్వాత వెంటనే బెయిల్ మంజూర్ చేయడం జరిగింది.