Electric Buses 2025: మీరు ఏపీలోని ఆ నగరంలో ఉంటున్నారా? అయితే ఈ ఛాన్స్ మీ కోసమే. ఇప్పటి వరకు మీరు పడిన ఇబ్బందులకు ప్రభుత్వం ఒక్క నిర్ణయంతో చెక్ పెడుతోంది. అలాగే ఓ వైపు పర్యావరణ పరిరక్షణ, మరోవైపు ప్రజలకు సౌకర్యం కల్పించడమే ప్రభుత్వం ముందున్న ముఖ్య ఉద్దేశం. ఇంతకు ఆ నగరం ఏమిటి? ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయం ఏమిటో తెలుసుకుందాం.
పల్లెల నుంచి నగరాల వరకు మారుతున్న వాతావరణ పరిస్థితులు, కాలుష్య కమ్ముకున్న నగర గాలి, పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకీ ఆకాశాన్ని తాకుతున్న ఈ తరుణంలో ప్రజలు మరో ఆలోచన చేస్తున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా పట్టణ జీవన విధానంలో రోజూ నగర రవాణా మీదే ఆధారపడే వృద్ధులు, ఉద్యోగులు, విద్యార్థుల కోసం సురక్షితమైన, శుభ్రమైన ప్రయాణం అనేది అత్యంత అవసరం. ఇక రాష్ట్ర ప్రభుత్వం దీనిని గుర్తించి, పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజా రవాణాలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించింది. అదే ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం.
విజయవాడలో ఇక ఆ సమస్యకు చెల్లు
ఇప్పటికే హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగుళూరు వంటి నగరాల్లో మంచి ఫలితాలు అందించిన ఎలక్ట్రిక్ బస్సుల ప్రయోగం.. ఇప్పుడు విజయవాడ నగరాన్ని చేరుకుంది. ఇటీవల నగరానికి 35 ఎలక్ట్రిక్ బస్సులు పంపిణీ చేశారు. వీటిలో 20 సిటీ ఆర్డినరీ బస్సులు, మిగిలిన 15 మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు ఉండగా, విజయవాడలో బిజీగా ఉండే ప్రధాన రూట్లపై నడపాలని అధికారులు నిర్ణయించారు.
ఈ బస్సుల ప్రయాణం కేవలం కాలుష్యాన్ని తగ్గించడానికే కాదు, ప్రజలకు ఒక నూతన ప్రయాణ అనుభూతిని అందించడానికీ అవకాశం కల్పిస్తోంది. పూర్తిగా శబ్దరహితంగా నడిచే ఈ బస్సులు నగరంలో ఒక పచ్చదన సందేశాన్ని ఇస్తున్నాయి. ప్రతి బస్సులో GPS ట్రాకింగ్, సీసీ కెమెరాలు, డ్రైవర్కు సంబంధించిన భద్రతా నియంత్రణ వ్యవస్థలు అమలు చేయబడ్డాయి. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, పిల్లలకోసం ప్రత్యేక సీట్లు ఏర్పాటు చేయడం విశేషం.
ఈ రూట్లలో స్పెషల్ బస్సులు
ఇప్పుడు ఈ బస్సులు విజయవాడలో కాళేశ్వరరావు మార్కెట్ నుండి ఆటోనగర్, రైల్వేస్టేషన్ – ఆటోనగర్, హెచ్బీ కాలనీ – ఆటోనగర్, హెచ్బీ కాలనీ – పెనమలూరు, సిటీ బస్పోర్ట్ – మైలవరం, సిటీ బస్పోర్ట్ – విస్సన్నపేట, కాళేశ్వరరావు మార్కెట్ – పామర్రు, ఎన్ఎస్బీ నగర్ – ఆటోనగర్, పీఎన్బీఎస్ – విస్సన్నపేట, జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీ – ఆటోనగర్, కబేళా – గవర్నమెంట్ ప్రెస్, జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీ – తాడిగడప వంటి రూట్లపై నడుస్తున్నాయి.
విద్యార్థులకు ఒక వరమే..
ఈ మార్గాలు విద్యార్థులు, ఉద్యోగులు అధికంగా ప్రయాణించే రూట్లు కావడంతో ప్రజలకు మరింత సౌకర్యం కలిగేలా ఉన్నాయి. ప్రత్యేకంగా రద్దీ సమయాల్లో ఎక్కువ బస్సులను నడపాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రయాణికులు ప్రయాణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా, బస్సుల వేయింగ్ టైమ్ తక్కువగా ఉండేలా షెడ్యూల్ను రూపొందించారు.
Also Read: Hyderabad to Tirupati: హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్తున్నారా? ఈ రూట్ వెరీ షార్ట్ కట్ గురూ!
ఇవి నగరానికి పెద్ద వరం అనే చెప్పొచ్చు. రోజుకు వందలాది డీజిల్ బస్సులు ధూళి లేపుతూ కాలుష్యం సృష్టిస్తున్న సమయంలో, విద్యుత్ బస్సుల రూపంలో నగరానికి శుభ్రత మరియు ఆరోగ్య దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ బస్సులు చార్జింగ్కు తక్కువ సమయం పడుతుండగా, ప్రయాణంలో మృదువైన అనుభూతిని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా శబ్ద కాలుష్యం లేకపోవడం వల్ల నగర గలగలల మధ్య ప్రశాంతతను అనుభవించవచ్చు.
ప్రస్తుతం నడుస్తున్న ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభం విజయవాడ నగరానికి మాత్రమే పరిమితం కాదు. ఈ ప్రయోగం విజయవంతమైతే త్వరలోనే గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం వంటి ఇతర నగరాలకూ విస్తరించనున్నట్లు సమాచారం. ఇదే తరహాలో భవిష్యత్తులో అన్ని పట్టణాల్లోనూ పాత డీజిల్ బస్సులను నిలిపివేసి, విద్యుత్ ఆధారిత ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఇలా చూస్తే విజయవాడ నగర ప్రజలకు ఇది కేవలం ప్రయాణ మార్గమే కాదు, పర్యావరణ పరిరక్షణలో భాగమైన గౌరవప్రదమైన ప్రయోజనంగా చెప్పవచ్చు. వచ్చే రోజుల్లో ప్రజలు తమకు దగ్గరగా ఉన్న బస్టాప్లలో ఎలక్ట్రిక్ బస్సుల షెడ్యూల్, లైవ్ స్టేటస్ వంటి సమాచారాన్ని మొబైల్ యాప్ ద్వారా కూడా తెలుసుకునే వీలున్నట్లు అధికారులు వెల్లడించారు.
అంతేకాక, విద్యుత్ బస్సుల నిర్వహణకు ప్రత్యేక చార్జింగ్ కేంద్రాలు, మెయింటెనెన్స్ గ్యారేజ్లు కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీని ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా తలుపుతట్టే అవకాశం ఉంది. పర్యావరణ పరిరక్షణతో పాటు నగర అభివృద్ధిలో విద్యుత్ బస్సులు ఒక మైలురాయి కావాలని, దీనిపై విజయవాడ ప్రజలలో సానుకూల స్పందన కనబడుతోంది.