Krishna : సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహాన్ని నానక్రామ్గూడలోని ఆయన నివాసంలోనే ఉంచారు. అభిమానుల సందర్శనార్థం విజయకృష్ణ నిలయం వద్దే పార్థివదేహాన్ని ఉంచినట్లు మహేశ్ బాబుకు చెందిన జీఎంబీ ఎంటర్టైన్మెంట్ ట్వీట్ చేసింది. మంగళవారం సూర్యాస్తమయం కావడం వల్ల పార్థివదేహాన్ని ఆయన నివాసం వద్దే ఉంచారు. మొదట సాయంత్ర 5 గంటల తర్వాత గచ్చిబౌలి స్టేడియానికి తరలించాలని భావించారు. కానీ తర్వాత బుధవారం ఉదయం 9 గంటలకు పద్మాలయా స్టూడియోకి పార్థివదేహాన్ని తరలించాలని నిర్ణయించారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు అక్కడే ఉంచుతారు. మధ్యాహ్నం తర్వాత మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఏర్పాట్ల బాధ్యతలను సీఎస్ సోమేశ్ కుమార్కు అప్పగించారు.
సూపర్స్టార్ కృష్ణ మరణంపై తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. నానక్రాంగూడలోని కృష్ణ ఇంటికి వచ్చి.. సినీ, రాజకీయ ప్రముఖులు సూపర్ స్టార్ భౌతికకాయానికి నివాళులర్పించారు. కృష్ణ మృతికి గౌరవ సూచికంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ తెలుగు సినీ పరిశ్రమ బుధవారం బంద్ పాటించనుంది. ఈ మేరకు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ప్రకటన విడుదల చేసింది.
కృష్ణ మరణ వార్త తమకు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ప్రకటించింది. సూపర్ స్టార్ తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కితాబిచ్చింది. అందరికీ ఆత్మీయుడిగా, ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన ఆయన ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ప్రకటించింది. కృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది.
దిగ్గజ నటుడు సూపర్స్టార్ కృష్ణ భౌతికకాయానికి ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి బుధవారం నివాళులర్పించనున్నారు. ఉదయం 11 గంటలకు మహేశ్బాబు కుటుంబాన్ని ఏపీ సీఎం పరామర్శిస్తారు.