Hyderabad News: నేటి సమాజంలో మానవత్వం మంటగలిసిపోతోంది. అడుగడుగునా స్వార్థం రాజ్యమేలుతున్న తరుణంలో.. ‘ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో’ తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. నమ్మకమే ఆయుధంగా.. వంచనే మార్గంగా కొంతమంది చేస్తున్న అకృత్యాలు సామాన్య ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కేవలం నగలు, నగదు కోసం తోటి మనిషి ప్రాణం తీయడానికి కూడా వెనుకాడని క్రూరత్వం నేడు రాజ్యమేలుతోంది. భౌతిక సంపద కోసం మనిషి తన విచక్షణను కోల్పోయి చేస్తున్న ఈ దోపిడీలు, దాడులు సామాన్యుడిని భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఒంటరిగా ఉన్నవారు, వృద్ధులు, అమాయకత్వం కలిగిన చదువురాని వారిని టార్గెట్ చేస్తున్నారు ఇప్పుడు ఈ దోపిడీ దారులు. అలాంటి ఘటనే హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలోని మెహిదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చదువురాని వారు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని ఏటీఎం మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ ఘటన నగరంలో ఇటీవల పెరుగుతున్న సైబర్, ఆర్థిక మోసాలపై మరోసారి ప్రజల్లో అవగాహన అవసరాన్ని గుర్తు చేస్తోంది. నిందితుల నుంచి పోలీసులు రూ.52 వేల నగదు, 89 ఏటీఎం కార్డులు, మూడు సెల్ఫోన్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం.. అరెస్టైన వారిలో హర్యానాకు చెందిన అమీర్ సుహెల్, ముబారిక్, ముస్తకీమ్ ఉన్నారు. వీరితో పాటు హైదరాబాద్కు చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ అమేర్ ఈ ముఠాకు సహకరిస్తున్నట్లు గుర్తించారు. ఆటో డ్రైవర్ స్థానికంగా బాధితులను గుర్తించడం, నిందితులను వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ముఠా సభ్యులు ఏటీఎం కేంద్రాల వద్ద సహాయం చేస్తున్నట్లు నటిస్తూ.. ముఖ్యంగా వృద్ధులు, చదువురాని వ్యక్తులను టార్గెట్ చేసేవారు. ఏటీఎం యంత్రాన్ని ఎలా ఉపయోగించాలో తెలియదని భావించిన బాధితులకు సహాయం చేస్తున్నట్లు చెప్పి.. వారి పిన్ నంబర్ను చాకచక్యంగా తెలుసుకుని అసలు కార్డును మారుస్తూ నకిలీ కార్డు ఇచ్చేవారు. అనంతరం బాధితుడికి తెలియకుండా వారి ఖాతా నుంచి నగదును విత్డ్రా చేసేవారు.
బాధితుల్లో ఒకరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. సీసీటీవీ ఫుటేజ్ , సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను పట్టుకున్నారు. వారిని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు పంపించారు.
ఈ సందర్భంగా.. ఏటీఎం కార్డు, పిన్ నంబర్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ చెప్పకూడదని.. అపరిచితుల సహాయాన్ని తీసుకోకూడదని పోలీసులు హెచ్చరించారు. ఏదైనా అనుమానాస్పద ఘటన ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఇటువంటి మోసాలపై ప్రజల్లో అవగాహన పెరిగితేనే నేరాలను అరికట్టడం సాధ్యమవుతుందని పోలీసులు పేర్కొన్నారు.
ALSO READ: Bears: వాల్మీకి మహర్షి విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఎలుగుబంట్లు