Maoist Surrender: ఛత్తీస్గఢ్ మావోయిస్టు అగ్రనేత బర్సే దేవా, రాజిరెడ్డి వంటి వారు సొంత రాష్ట్రాలను కాదని తెలంగాణలో లొంగిపోవడానికి ఇక్కడి ‘పునరావాస విధానం’తో పాటు.. పొరుగున ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు కూడా ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి బీజేపీ పాలిత ప్రాంతాల్లో మావోయిస్టుల ఏరివేతపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ (కేంద్రం, రాష్ట్రం బీజేపీ) అధికారంలో ఉండటంతో ‘ఆపరేషన్ కగార్’ పేరిట ఎన్కౌంటర్లను తీవ్రతరం చేశారు. అక్కడ లొంగిపోదామన్నా, ఏమాత్రం తేడా వచ్చినా ఎన్కౌంటర్ చేస్తారేమోనన్న భయం అగ్రనేతలను వెంటాడుతోంది.
దీనికి భిన్నంగా, తెలంగాణలో పరిస్థితి వారికి అనుకూలంగా కనిపిస్తోంది. ఇక్కడ మావోయిస్టుల కార్యకలాపాలు తక్కువగా ఉండటం, ప్రభుత్వం లొంగిపోయిన వారి పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తుండటం వారికి కలిసొచ్చే అంశం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ‘జీరో టాలరెన్స్’ (Zero Tolerance) పేరుతో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్ల నుంచి ప్రాణాలు దక్కించుకోవడానికి, మావోయిస్టులు తెలంగాణను ఒక ‘సేఫ్ జోన్’ (Safe Zone)గా ఎంచుకుంటున్నారని తెలుస్తోంది. ఇక్కడి పోలీసులు లొంగిపోయిన వారిని చంపరని, ప్రాణ రక్షణ కల్పిస్తారనే బలమైన నమ్మకమే దేవా వంటి అగ్రనేతలను హైదరాబాద్ వైపు నడిపించింది.
తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి దండకారణ్యంలో వైద్యం అందడం లేదు. ఛత్తీస్గఢ్ పట్టణాలకు వెళ్తే పోలీసుల కంటపడి ఎన్కౌంటర్కు గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే, మెరుగైన వైద్యం, ప్రాణ భద్రత, ఆర్థిక సాయం.. ఈ మూడూ దొరికే ఏకైక మార్గంగా వారు తెలంగాణను ఎంచుకున్నారు. సొంత గడ్డపై బతకాలనే కోరిక ఉన్న రాజిరెడ్డి వంటి వారి ప్రభావం, తెలంగాణ ఇంటెలిజెన్స్ (SIB) వ్యూహం కూడా ఈ భారీ లొంగుబాటుకు మార్గం సుగమం చేశాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also: మావోయిస్టులకు బిగ్ షాక్.. డీజీపీ ఎదుట బర్సే దేవా, రాజిరెడ్డి లొంగుబాటు!