Bandi Sanjay: స్వేచ్ఛ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. మోడీ 3.0 పాలనలో దక్షిణ భారత దేశంలో కేంద్రం నుంచి అత్యధిక ప్రయోజనాలు పొందుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. అందులో భాగంగా గత రెండేళ్లలో రూ.3 లక్షల కోట్లకుపైగా ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేసుకోగలిగామన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండటంవల్లే ఇది సాధ్యమైందన్నారు.
అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే ఆఫీసర్స్ క్లబ్ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన రోజ్ గార్ మేళా కార్యక్రమానికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంజయ్ 120 మంది అభ్యర్థులకు అపాయిట్ మెంట్ లెటర్లను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి కోసం సైతం మోడీ ప్రభుత్వం 12 ఏళ్లలో రూ.12 లక్షల కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. తెలంగాణ ప్రజలు సైతం డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలనే భావనలో ఉన్నారని తెలిపారు. 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలనే లక్ష్యంతో 2022లో రోజ్గార్ మేళాను ప్రారంభించారని, మొదట్లో ఇది జరిగే పనేనా? అని చాలా మంది హేళన చేశారని, కానీ వాటిని పట్టించుకోకుండా అవినీతి, పైరవీలు, దళారుల ప్రమేయం లేకుండా ఇప్పటి వరకు 11 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశారని కొనియాడారు.
కరీంనగర్ లో కొలిక్కి వచ్చిన కేంద్ర బలగాల గ్రూప్ సెంటర్ ఏర్పాటు
కరీంనగర్ లో కేంద్ర పారా మిలటరీ బలగాలకు సంబంధించి గ్రూప్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేస్తున్న యత్నాలు కొలిక్కి వచ్చాయి. అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సీఆర్పీఎఫ్ బలగాల గ్రూప్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరుతూ బండి సంజయ్ సంబంధిత విభాగాల డీజీపీలతో ఇటీవల చర్చలు జరిపారు.
రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయిస్తే గ్రూప్ సెంటర్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించవచ్చని ఆయా డీజీపీలు పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకున్న బండి సంజయ్ కుమార్ గత మార్చి 10న కేంద్ర పారా మిలటరీ బలగాల గ్రూప్ సెంటర్ కోసం కరీంనగర్ లో తగిన స్థలం కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. కాగా కేంద్ర మంత్రి లేఖకు సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ పంపిన ప్రతిపాదనలను సీసీఎల్ఏ కు పంపారు.
పరిశీలించిన సీసీఎల్ఏ ఆయా ప్రతిపాదనలను రాష్ట్ర కేబినెట్ కు పంపింది. ఈరోజు సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం మానకొండూరులోని వెల్దిలో 4 ఎకరాలు, చొప్పదండిలోని రుక్మాపూర్ లో 5 ఎకరాలు గన్నేరువరంలో 5 ఎకరాలు వెరసి మొత్తం 14 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ తీర్మానించింది. ఈ నేపథ్యంలో కరీంనగర్ లో పారామిలటరీ బలగాల గ్రూప్ సెంటర్ ఏర్పాటుపై మరో అడుగు ముందుకు పడినట్లయింది. త్వరలోనే కేంద్రం గ్రూప్ సెంటర్ ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకోనుంది.
Also Read: లక్షల కోట్ల ఆదాయం ఉన్నా.. రూ. 214 లక్షల కోట్ల అప్పు ఎందుకు? అసలు నిజాలు ఇవే!