Bandi Sanjay Latest News(TS Political Updates): బండి సంజయ్ని వదిలేదేలే అంటోంది ప్రభుత్వం. టెన్త్ పేపర్ లీకేజీ ఘటనలో ఆయన్ను ఏ1 నిందితుడిగా చేసి.. అరెస్ట్ చేసి.. జైలుకు పంపించింది. ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నారు బండి సంజయ్. బెయిల్ ఇచ్చే సమయంలో కోర్టు కొన్ని షరతులు పెట్టింది. ఆ పాయింట్ను బేస్ చేసుకుని.. మళ్లీ సంజయ్ను చెరశాలలో వేయాలని చూస్తోంది సర్కారు.
లేటెస్ట్గా హన్మకొండ కోర్టులో బండి సంజయ్ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు ప్రభుత్వ తరఫు లాయర్. పోలీసుల విచారణకు సంజయ్ సహకరించడం లేదని అన్నారు. ఆయన సెల్ఫోన్ను ఇంత వరకూ పోలీసులకు ఇవ్వలేదని.. అందులో కీలక సమాచారం ఉందని పిటిషన్లో తెలిపారు. మరోవైపు, బెయిల్ నిబంధనలు ఉల్లంఘించి బండి సంజయ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ.. అందుకే ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించారు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్.
ఇటీవలే హన్మకొండలో నిరుద్యోగ మార్చ్ పేరుతో భారీ బలప్రదర్శన చేశారు బండి సంజయ్. ఆ ర్యాలీలో ప్రభుత్వాన్ని ఉద్దేశించి పదునైన విమర్శలు చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనలో మంత్రి కేటీఆర్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే తనను టెన్త్ పేపర్ లీక్ కేసులో అరెస్ట్ చేశారని మండిపడ్డారు. బీజేపీ చేపట్టిన నిరుద్యోగ మార్చ్ గ్రాండ్ సక్సెస్ కావడం.. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి మార్చ్కు మద్దతు తెలపడం.. ఆ మార్చ్లో బండి సంజయ్ ప్రసంగానికి మంచి స్పందన రావడంతో.. ప్రభుత్వం ఉలిక్కిపడినట్టుంది. అందుకే, బండి బెయిల్ రద్దు చేయాలంటూ మళ్లీ అటాకింగ్ స్టార్ట్ చేసిందంటూ కమలనాథులు మండిపడుతున్నారు. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరగనుంది. మరి, బండి సంజయ్ బెయిల్ రద్దు అవుతుందా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది.