Atiq Ahmad: అతీక్ అహ్మద్. యూపీలో పేరు మోసిన గ్యాంగ్స్టర్. మాజీ ఎంపీ కూడా. అతని పేరు చెబితేనే యూపీ మొత్తం గడగడలాడిపోతుంది. అది ఒకప్పటి మాట. యోగి సీఎం అయ్యాక సీన్ మారిపోయింది. యోగి పేరు చెబితే.. అతీక్ లాంటి డాన్లంతా చావు భయంతో వణికిపోతున్నారు. అందుకే, ఇటీవల జైలు నుంచి కోర్టుకు తరలిస్తుంటే తనను ఎన్కౌంటర్ చేస్తారేమోనని బెదిరిపోయాడు. అయితే, పోలీసులు అతన్ని కాకుండా అతని కొడుకును ఎన్కౌంటర్లో లేపేసి ట్విస్ట్ ఇచ్చారు. ఆ షాక్ నుంచి కోలుకోకముందే.. అతీక్ అహ్మద్ను కాల్చి చంపారు హంతకులు. చంపింది పోలీసులు కాదు. అందుకే ఈసారి పోలీసులకు షాక్ తగిలింది. సీఎం యోగి అర్జెంట్ మీటింగ్ పెట్టారు. హత్యపై విచారణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు.
అతీక్ను చాలా ఈజీగా చంపేశారు నిందితులు. జర్నలిస్టుల మాదిరి వచ్చారు ముగ్గురు. అతీక్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్తుంటే.. అతని కణతకి తుపాకీ ఆనించి మరీ.. పాయింట్ బ్లాంక్ రేంజ్లో బుల్లెట్ దింపాడు హంతకుల్లో ఒకడు. ఆ ఫైరింగ్కు పోలీసులు బెదిరిపోయి తలోదిక్కుకు పారిపోయారు. అదే ఛాన్స్గా ముగ్గురు హంతకులు అతీక్పై, అతని సోదరుడు అష్రఫ్పై ధనాధన్ కాల్పులు జరిపారు. షూటవుట్ తర్వాత వారేమీ అక్కడి నుంచి పారిపోలేదు. ఎంచక్కా చేతులు పైకెత్తి.. స్పాట్లోనే పోలీసులకు సరెండర్ అయ్యారు.
గ్యాంగ్స్టర్ అతీక్ను అంత డేర్ చేసి చంపారంటే.. వారికేవో పాత పగలు ఉన్నాయని అనుకోవచ్చు. కానీ, అలాంటివేమీ లేవు. అతీక్కు అతన్ని చంపిన హంతకులకు అసలేమీ సంబంధం లేదు. మరి, ఎందుకు చంపినట్టు? పోలీసులు నిందితులను ఇదే ప్రశ్న అడిగారు. వారిచ్చిన ఆన్సర్ విని షాక్ అయ్యారు.
తాము పాపులర్ అవడానికే గ్యాంగ్స్టర్ను లేపేశామంటూ గొప్పగా చెప్పారు ఆ ముగ్గురు హంతకులు. అతీక్ గ్యాంగ్ను ఖతం చేసి, యూపీలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు, పేరు సంపాదించాలనే వారిని కాల్చి చంపామని అంటున్నారు. ఈ విషయాన్ని పోలీసులు ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. నిందితులు లావ్లేష్ తివారీ (22), మోహిత్ అలియాస్ సన్నీ (22), అరుణ్ మౌర్య (18)లు ఈ దారుణానికి తెగించారు. మరి, వాళ్లు చెప్పేదంతా నిజమేనా? కేవలం పేరు కోసమే ఇంత శాహసానికి ఒడిగట్టారా? వారి వెనుక వేరే పెద్దలు ఉన్నారా? సుపారీ తీసుకుని ఈ హత్య చేశారా? కేసును డైవర్ట్ చేసేందుకే అలా చెబుతున్నారా? మర్డర్ స్పాట్లో ‘జై శ్రీరాం’ అంటూ నినాదాలు చేయడమూ వ్యూహాత్మకమా? అనే అనుమానాలూ లేకపోలేదు.
ఇక, ఆ ముగ్గురు నిందితుల బ్యాక్గ్రౌండ్ కూడా వెరీ బ్యాడ్ అని తెలుస్తోంది. లావ్లేష్ తివారీ జులాయి, డ్రగ్స్కు బానిసయ్యాడని స్థానికులు చెబుతున్నారు. నేర సామ్రాజ్యంలో గొప్ప పేరు తెచ్చుకోవాలని కలలు కంటుండేవాడని అన్నారు. మరో నిందితుడు మోహిత్ పలు కేసుల్లో జైలుకు వెళ్లివచ్చినవాడే. అరుణ్ మౌర్య కూడా అంతే.
యూపీలో అతీక్ అహ్మద్ హత్య జరిగిన తీరును.. గతంలో ఏపీలో పరిటాల రవి మర్డర్ జరిగిన తీరుతో పోలుస్తున్నారు కొందరు. పరిటాల రవిని సైతం అత్యంత సమీపం నుంచే కాల్చి చంపాడు మొద్దు శీను. ఆ సమయంలో రవితో పాటు అతని గన్మెన్లు కూడా ఉన్నారు. అయినా, ఎదురుగా వచ్చి.. నేరుగా గురిపెట్టి.. తుపాకీతో షూట్ చేశాడు మొద్దు శీను. ఆ సమయంలో గన్మెన్లు భయంతో పారిపోయారు. ఆ తర్వాత స్పాట్ నుంచి పారిపోయాడు. ఓ ఇంటర్వ్యూలో బావ కళ్లలో ఆనందం చూట్టానికే పరిటాల రవిని చంపానంటూ చెప్పాడు. పేరు కోసమూ చంపి ఉంటాడని అంటారు. ఇప్పుడు యూపీలోనూ నిందితులు పోలీసుల రక్షణలో ఉన్న అతీక్ అహ్మద్ను పాయింట్ బ్లాంక్ రేంజ్లో గురిపెట్టి కాల్చి చంపడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మీ ‘పేరు’ పాడుగాను!